
Hyd, June 6: తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు ( Four policemen were sentenced) నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు జైలు శిక్ష విధించింది హైకోర్టు. అంతేకాదు నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పోలీసు అధికారుల మీద గతంలో భార్యభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండానే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసినట్లు పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు.. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు నాలుగు వారాలు జైలు శిక్ష (4 weeks in prison ) విధిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఈ నలుగురిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది కోర్టు. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది.