Man Married 11 Women: ఒకరా...ఇద్దరా.. ఏకంగా 11 మందిని పెళ్లాడిన రసికుడు, పైగా పక్క పక్క ఇళ్లల్లోనే కాపురం పెట్టాడు, గుట్టురట్టు కావడంతో పరార్, మీడియా ముందుకు వచ్చిన బాధితురాళ్లు
తెలంగాణలో ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 11 మందిని ఓ ఘనడు పెళ్లాడాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా మొత్తం 11 మందిని పెళ్లిచేసుకున్న అతగాడి (Man Married 11 Women) బాగోతాన్ని ఇద్దరు భార్యలు ఆధారాలతో సహా బయటపెట్టారు.
Hyd, July 14: తెలంగాణలో ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 11 మందిని ఓ ఘనడు పెళ్లాడాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా మొత్తం 11 మందిని పెళ్లిచేసుకున్న అతగాడి (Man Married 11 Women) బాగోతాన్ని ఇద్దరు భార్యలు ఆధారాలతో సహా బయటపెట్టారు. రెండో పెళ్లికోసం ఎదురు చూసే సంపన్న మహిళలే లక్ష్యంగా వారికి కొత్త జీవితం ఇస్తానని ఆశలు కల్పించి ఏకంగా 11 మందిని (Hyderabad man marries 11 women ) పెళ్లి చేసుకున్నాడు. వీరిలో ఒకే కాలనీలోని మూడు వీధుల్లో ముగ్గురితో కాపురాలు (Kept Them In Adjacent Streets Of Kondapur) చేస్తుండటం గమనార్హం.
పెళ్లిచేసుకున్న వారిలో ఏడుగురితో పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడు. వారివద్ద దొరికినంతా దోచుకుంటూ జల్సాలు చేసుకుంటూ వచ్చాడు. డబ్బులు ఏవని ప్రశ్నిస్తే క్లయింట్ వద్దకు వెళ్తున్నా వస్తాయంటూ వేరే భార్యవద్దకు వెళ్లేవాడు. ఇలా కొంతకాలం తరువాత ఓ భార్యకు అనుమానం రావడంతో అసలు ఏం చేస్తున్నాడని ఆరా తీయడం మొదలు పెట్టింది. అప్పుడు తెలిసింది.. నిత్యపెళ్లి కొడుకు బండారం.. ఖంగుతిన్న మహిళ తాము మోసపోయామని గుర్తించి అతగాడి మరో భార్యతో కలిసి నిత్యపెళ్లికొడుకు బండారాన్ని బయటపెట్టారు.
గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్ బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు. వివాహమై విడాకులు తీసుకున్న యువతులే లక్ష్యంగా చేసుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా 11 మంది పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శివశంకర్ మాయమాటలకు మోసపోయిన వారిలో ఎక్కువ మంది విద్యావంతులే కావటం గమనార్హం. శివశంకర్ మాయమాటలకు మోసపోయిన వారిలో ఇద్దరు భార్యలు విలేకరుల సమావేశం పెట్టిమరీ అతగాడి గుట్టురట్టు చేశారు.
తమకు పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ ఉద్యోగం అంటూ నమ్మించి పెళ్లిచేసుకున్నాడని, కొంతకాలం తరువాత అవసరాలకోసం తమ వద్ద డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. అవి ఏం చేశావంటూ నిలదీస్తే క్లయింట్ వద్దకు వెళ్తున్నా అంటూ వెళ్లిపోయేవాడని, ఆ తర్వాత కొద్దిరోజులు కనిపించేవాడు కాదని, ఫోన్ స్విచ్ఛాప్ వచ్చేదని మోసపోయిన బాధితులు తెలిపారు.
పెళ్లి పేరుతో మోసం చేశాడని, సుమారు రూ. 60లక్షలు వరకు నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు వాపోయారు. శివశంకర్ కు ఎలాంటి ఉద్యోగం లేదని, క్లయిట్ వద్దకు వెళ్తున్నానని చెప్పి మరో భార్య దగ్గరికి వెళ్లేవాడని వారు తెలిపారు. ఏడుగురు భార్యలతో మణికొండలోని పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడని, ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం చేసేవాడని బాధిత మహిళలు తెలిపారు. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువునని శివశంకర్ చెప్పినట్లు వారు పేర్కొన్నారు. తాము మోసపోయినట్లు మరొకరు మోసపోవద్దనే తాము మీడియా ముందుకు వచ్చామని, తమను మోసం చేసి శివశంకర్ ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
అడపా శివశంకర్ బాబు బీటెక్ చదివాడు. మ్యాట్రిమోనీ సైట్లలో రెండో వివాహం కోసం పేరు నమోదుచేసుకున్న ఉన్నత విద్యావంతులు, ఉద్యోగం చేస్తున్న మహిళల ప్రొఫైళ్లు చూసి సంప్రదించేవాడు. ఈ క్రమంలోనే ఓ మహిళను పరిచయం చేసుకుని తనకూ వివాహమై విడాకులు తీసుకున్నానని, ఓ కుమార్తె ఉందని, విడాకుల ధ్రువపత్రం చూపి ఆమెను నమ్మించాడు. ఐటీ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, జీతం నెలకు రూ.2లక్షలని పే స్లిప్ చూపించాడు. అతడు చెప్పిన విషయాలన్నీ నమ్మిన మహిళ కుటుంబం రూ.లక్షల కట్నం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లైన కొద్దిరోజులకే భార్యను ఉద్యోగం మాన్పించేవాడు.
ఇంకొకరిని ప్రాజెక్టు పనిమీద తనను అమెరికా పంపుతున్నారని ఇద్దరం వెళ్దామని చెప్పి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. వీసా ప్రాసెస్ కోసం డబ్బు అవసరమని భార్య నుంచి, అత్తింటిలో అందరి నుంచి అందినకాడికి తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత అమెరికా ప్రయాణం వాయిదా పడిందని చెప్పాడు. అయితే తాము ఇచ్చిన డబ్బును అత్తింటి వారు అడగ్గా తప్పించుకుని తిరిగేవాడు. వారు గట్టిగా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో అతడి భార్య మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు శివశంకర్ని స్టేషన్కు పిలిపించారు.
ఆ సమయంలో మరో మహిళతో స్టేషన్కు వచ్చిన శివశంకర్ ఆమె తన భార్య అని చెప్పాడు. డబ్బు ఇచ్చే భరోసా తమదేనంటూ ఆమెనే మధ్యవర్తిగా ఉంచాడు. అయితే భార్యకు విడాకులు ఇచ్చానన్న వ్యక్తి మరో మహిళను భార్య అని చెప్పడం, రెండో మహిళకూ అతడిపై అనుమానం రావడంతో ఆ ఇద్దరు తర్వాత మాట్లాడుకున్నారు. ఇద్దరినీ ఒకేలా మోసం చేసినట్లు, ఇద్దరికీ ఒకేలా చెప్పి రూ.లక్షల్లో డబ్బు లాగినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో రెండో మహిళ తన సోదరులకు చెప్పి అతనిపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే శివశంకర్ ఒకే కాలనీలో మూడు వీధుల్లో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్న విషయం బయటపడింది. దీంతో ఆమె అతడిని నిలదీయగా ఇంటికి రావడం మానేశాడు. దీంతో ఇద్దరు మహిళలు కలిసి ఆరా తీయగా మొత్తం 11 మందిని పెళ్లి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. శివశంకర్ మొదటి వివాహం 2018లో జరగ్గా... ఆ తర్వాత అబద్ధాలు చెప్పి ఒక్కొక్కరిని పెళ్ల చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.
చివరికి ఏప్రిల్ నెలలో ఓ యువతిని తీసుకుని పరారీ అయినట్లు తెలిసింది. శివశంకర్ మోసాలపై 2019లో కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో ఒకరు, 2021లో మరొకరు, ఆర్సీ పురం, గచ్చిబౌలి, అనంతపురం, ఎస్ఆర్ నగర్ ఠాణాలలో వేర్వేరు మహిళలు ఫిర్యాదులు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. తాను ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు దగ్గరి బంధువునని తరుచూ తమవద్ద ప్రస్తావించేవాడని బాధిత మహిళలు చెబుతున్నారు. శివశంకర్ లాంటి వ్యక్తిని అలా వదిలేస్తే ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేస్తాడని, అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఇద్దరు మహిళలు కోరుతున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 14, 2022 07:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

