Telangana Politics: పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్, కేసీఆర్కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి
గత కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించారు
Hyd, Feb 14: గత కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘నిరుద్యోగులారా అధైర్యపడకండి .. మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు.
నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే తమ ప్రయత్నమని చెప్పారు. తమ కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజలు అని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఇవాళ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో.. ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అంతే సంతోషం కలుగుతోందన్నారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలని గత ప్రభుత్వానికి తొమ్మిదిన్నరేళ్లపాటు ఆలోచన రాలేదు. అధికారులతో సమీక్షించి అన్ని ఆటంకాలు తొలగించాం. నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీశ్రావు అంటున్నారు. ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తూనే నాకు నిద్ర పడుతుంది. మీరంతా మా తమ్ముళ్లు.. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటామన్నారు. 13,444 మంది ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. నర్సింగ్ ఆఫీసర్స్, సింగరేణి ఉద్యోగాల్లో చిక్కుముడులు విప్పి నియామకాలు పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ సమాజం నిన్ను బహిష్కరించిందని ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా కేసీఆర్.. ప్రజలు బండకేసి కొట్టారని ఇప్పటికైనా తెలుసుకోండి.. నిన్న నల్లగొండ వెళ్లి కేసీఆర్ బీరాలు పలుకుతుండు...పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని అంటుండు.. ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారు.. ఏ రేసుకు వెళ్లినా గుర్రాలదే గెలుపు... కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుంది. నన్ను చంపుతారా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటుండు... చచ్చిన పామును ఎవరైనా చంపుతారా. కేసీఆర్ నీ పని అయిపోయింది.. ఖేల్ ఖతం దుఖాన్ బంద్.. ఏ తప్పు లేకుండా.. ఎవరికి నష్టం జరగకుండా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
పదేళ్లు నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతారని వయస్సును 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. మీ ఆశీర్వాదం ఉంటే పదేళ్లు కాదు 20ఏళ్లు ప్రజా ప్రభుత్వం ఉంటుంది.. కేసీఆర్కు సూటిగా సవాల్ (Let's see how KCR will come) విసురుతున్నా.. పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్ (I will be the CM for ten years) గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మనకు రావాల్సిన నీటిని రాకుండా చేశారు. కేసీఆర్ సంతకం తెలంగాణ రైతులకు గుదిబండగా మారింది. ఒక్క సంతకంతో కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.
అది మేడిగడ్డ కాదు.. మేడిపండు.. పొట్ట విప్పితే పురుగులు బయటపడతాయనే నల్లగొండలో సభ పెట్టారు. తెలంగాణను కబలించడానికి గంజాయి, డ్రగ్స్ ముఠాలు తిరుగుతున్నాయి.. గంజాయి ముఠాను కూకటివేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే గంజాయి, డ్రగ్స్ ముఠాలు రాష్ట్రంలో ఉండకూడదు’’ అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు.
మీకోసం పనిచేయడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉండి మీకోసం 24గంటలూ కష్టపడి పనిచేస్తా. మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Feb 14, 2024 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

