Hyderabad, June 6: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు (New Covid Cases) నమోదయ్యాయి. కరోనాతో 14 మరణాలు (Covid Deaths) సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 27,016 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కరోనా నుంచి 3,614 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ఇవాళ 97,751 మందికి కరోనా పరీక్షలు చేశారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 184 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ (Black Fungus) తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది.
గత వారం పది రోజులతో పోలిస్తే.. ప్రస్తుతం ఆ స్థాయిలో కేసులు నమోదు కావడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటులోనూ కొత్త కేసులు తక్కువగానే వస్తున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే మరో నెల రోజుల వరకు కేసులు నమోదవుతూనే ఉంటాయని అంటున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
జీహెచ్ఎంసీలో ఎక్కువ రిస్క్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ ముగిసింది. మే 28 నుంచి ఈ రోజు వరకు వ్యాక్సినేషన్ చేశారు. 30 సర్కిల్స్లోని 31 కేంద్రాల్లో రోజూ వెయ్యి మందికి వ్యాక్సిన్ వేశారు. 3 లక్షల మంది హైరిస్క్ పర్సన్స్కు గాను 2.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశారు. సోమవారం నుంచి ఫ్రూట్ మార్కెట్లు, శ్మశాన వాటికల్లో పని చేసే వారికి వ్యాక్సినేషన్ చేస్తారు. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది.
హైదరాబాద్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సైబరాబాద్ పోలీసులతోపాటు సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, ఒక కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం జాయింట్గా ఈ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇవాళ 50 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం వీకెండ్ కావడంతో వేలాదిమంది వ్యాక్సినేషన్ కోసం తరలి వస్తున్నారు.
కరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. తాజాగా బన్సీలాల్పేట్లో మొబైల్ మెడికల్ వ్యాన్ను సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధులు, దివ్యాంగులకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు సీఎస్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోందన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
మొబైల్ యూనిట్లో డాక్టర్, ఫార్మాసిస్ట్, ఏఎన్ఎం ఉంటారని తెలిపారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం, మానవ వనరుల బలోపేతం, సామర్థ్యం పెంపొందించడం, వైరస్ వ్యాప్తి చేసే గ్రూపులకు టీకాలు వేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సీఎస్ పేర్కొన్నారు. ఎక్కువ మందిని కలుస్తూ సూపర్ స్ప్రెడర్లుగా మారడానికి అవకాశం ఉన్నవారికి ప్రభుత్వం ముందుగా టీకా వేస్తున్న విషయం తెలిసిందే.