Telangana: కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరు, సినిమా డైలాగులకు ఓట్లు రావు, తాను కన్ఫ్యూజన్‌లో లేనని, ఫుల్ క్లారిటీతో ఉన్నానని స్పష్టం చేసిన రాజగోపాల్‌రెడ్డి
Congress MLA Rajgopal Reddy (Photo-IANS)

Hyd, July 25: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka ) అన్నారు. రాజగోపాల్‌ తమ ఎమ్మెల్యే కాబట్టే మాట్లాడడానికి వచ్చానన్నారు. పదవులు చాలా మంది కోరుకున్నా కొందరికే దక్కుతాయన్నారు. రాష్ట్ర ప్రజల లక్ష్యాల కోసం పనిచేద్దామని రాజగోపాల్‌తో చెప్పానని తెలిపారు. కేసీఆర్‌పై సీరియస్‌గా పోరాడుదామని రాజగోపాల్ అన్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

భట్టితో భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి (Rajgopal Reddy) మీడియాతో మాట్లాడుతూ తాను కన్ఫ్యూజన్‌లో లేనని, ఫుల్ క్లారిటీతో ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్‌ కాంగ్రెస్‌ లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ (CM KCR) బలవంతుడని, ఆయనను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్‌ని ఎదుర్కొనే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పార్టీ మారొద్దని భట్టి విక్రమార్క సూచించారని, పార్టీలో తనకు ఇంతలా ఇబ్బంది ఉన్నా.. ఎందుకు మాట్లాడట్లేదని భట్టిని ప్రశ్నించానని తెలిపారు. కొత్తవాళ్లు వచ్చి పార్టీలో పదవులు చేపడితే ఇబ్బందిగా ఉందన్నారు. తనది నిజమైన కాంగ్రెస్ రక్తమని ప్రకటించారు. నిజమైన కాంగ్రెస్ నేతలకు పార్టీలో గౌరవం లేదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12 వేల కోట్లు, సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం ఏటా మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని మండిపడిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరని విమర్శించారు. చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని అన్నారు. సినిమా డైలాగులకు ఓట్లు రావని స్పష్టం చేశారు. భట్టి తనతో ప్రత్యేకంగా మాట్లేందుకు వచ్చారని ఆయనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భట్టి తాను అన్నదమ్ముల్లాగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు తానెక్కడ దూరం అవుతానేమోనన్న ఆవేదనతో భట్టి వచ్చారని తెలిపారు. సీఎల్పీ ఇవ్వాలని నేను కూడా అడిగా. నాకు ఇవ్వకుంటే సీఎల్పీ నాయకుడిగా భట్టికి ఇవ్వాలని అధిష్టానానికి చెప్పాను.

పీసీసీ అధ్యక్షుడి మార్పు కూడా తొందరగా చేయలేదు. 12 మంది ఎమ్మెల్యేలు పోయినా కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదని చెప్పాను. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది నిజం. బీజేపీ బలపడుతోందని నేను పలుమార్లు చెప్పాను. చెప్పిందే నిజమైంది. ఈటలకు బీజేపీ తోడైంది. అందుకే గెలిచారు. నేను కన్ఫ్యూజ్‌ కాలేదు.. క్లారిటీతో చెప్పా. బీజేపీ, టీఆర్‌ఎస్‌ను ఓడిస్తుందని నమ్ముతున్నా. మునుగోడుకు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వందసార్లు వెళ్లినా ఒక్కటే.. నేను ఒక్కసారి వెళ్లినా ఒక్కటే.. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చేందుకు మంత్రి వెళ్లాల్సిన అవసరముందా’ అని ప్రశ్నించారు.ఇదిలా ఉంటే ఆగస్టు నెలాఖరుకు రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా బీజేపీ కీలక నేతలతో చర్చ జరిగిందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భయపడి ఇంట్లో కూర్చుంటే చరిత్ర హీనుడిగా మిగులుతానన్నారు. అయితే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందన్నది సీఎం కేసీఆర్‌ ఆడుతున్న డ్రామా, దుష్ప్రచారం అని ఆరోపించారు. తాను మాత్రం ఉప ఎన్నికను కోరుకోవడంలేదని, రాజీనామా చేయాలనుకోవడంలేదని తెలిపారు.