
Hyd, Feb 27: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలు కలిపి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది(Telangana MLC Elections Polling).
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర ప్రైవేటు మేనేజ్మెంట్(MLC Elections Polling begins), అథారిటీల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేలా యజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని అధికారులు కోరారు.
ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం(Teacher MLC), ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు కంట్రోల్ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు సహా కేంద్ర ఎన్నికల సంఘం(CEC) అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని రిటర్నింగ్ అధికారులు సూచించారు.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. వీరి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోగా మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.