Hyderabad, June 16: సెకండ్ వేవ్ కరోనాను ఎదుర్కోవడానికి సుమారు నెలరోజుల పాటు విధించిన కఠిన లాక్డౌన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర పకడ్బందీ చర్యల వలన తెలంగాణలో రోజూవారీ కోవిడ్19 కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతానికి పడిపోగా, రికవరీ రేటు 96.13 శాతానికి మెరుగుపడింది.
ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ నెల నుంచి విజృంభించిన సెకండ్ వేవ్ ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖంపట్టింది. జూన్ చివరి వారం లేదా జూలై నాటికి సెకండ్ వేవ్ దాదాపు నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఇప్పట్నించైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే థర్డ్ వేవ్ కరోనా విజృంభించకుండా నియంత్రిచవచ్చునని సూచిస్తున్నారు.
ఇక, తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,16,252 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1489 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1293 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,07,925కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 175 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 131, ఖమ్మం నుంచి 118 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 98 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 11 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,521కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1436 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,84,429 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,975 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.