COVID19 in Telangana: వానాకాలంలో కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరికలు; తెలంగాణలో కొత్తగా 1556 కోవిడ్ కేసులు, 14 మరణాలు నమోదు
Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

Hyderabad, June 15: ఏడాది కాలం గడిచినా కూడా కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి ఇప్పటికీ ఆగడం లేదు, ఇది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగంహెచ్చరికలు జారీ చేసింది.  సాధారణంగా జూలై మరియు అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా వ్యాధులు సంభవిస్తాయి. ఈ వర్షాకాలంలో వైరల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే నవంబర్ మరియు మార్చి మధ్య స్వైన్ ఫ్లూ, ఆ తరువాత ఏప్రిల్ మరియు జూన్ మధ్య వడదెబ్బ, జ్వరాల బారినపడే అవకాశం ఉంటుంది.  కాబట్టి,  వీటి బారిన పడకుండా ఉండటమే కాకుండా సీజన్ తో సంబంధం లేని కరోనా సోకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ క్యాలెండర్ విడుదల చేసింది. కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ,  స్వీయ రక్షణ పాటిస్తే మిగతా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,043 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1556 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1013 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,06,436కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 182 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 131, నల్గొండ నుంచి 135 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 114 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 14 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,510కు పెరిగింది.

అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 2,070 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,82,993 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,933 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.