
Hyderabad, March 17: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడటం కలవరపాటుకు గురిచేస్తుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు వంద మందికి పైగా విద్యార్థులకు కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారింపబడినట్లు సమాచారం.
మొత్తంగా రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదయిన కోవిడ్ కేసుల గణాంకాలను పరిశీలిస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 60,527 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 247 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 588 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,01,769కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 29 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మంచిర్యాల నుంచి అత్యధికంగా 45 కేసులు, మేడ్చల్ నుంచి 41, కామారెడ్డి నుంచి 35 మరియు రంగారెడ్డి జిల్లాల నుంచి 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,659కు పెరిగింది.
అలాగే మంగళవారం సాయంత్రం వరకు మరో 158 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,98,009 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2101 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లలతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు.