COVID in TS: తెలంగాణలో డెల్టా వేరియంట్ కేసులు గుర్తింపు; రాష్ట్రంలో కొత్తగా 614 కోవిడ్ కేసులు నమోదు, వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న సినిమా హాళ్లు

తెలంగాణలో కేసులు తగ్గుముఖంపడుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈరోజు పలు చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 100 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు నడుస్తున్నాయి...

COVID in TS: తెలంగాణలో డెల్టా వేరియంట్ కేసులు గుర్తింపు; రాష్ట్రంలో కొత్తగా 614 కోవిడ్ కేసులు నమోదు, వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న సినిమా హాళ్లు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, July 30: దేశంలో కరోనావైరస్ యొక్క జన్యు శ్రేణిని పర్యవేక్షించే ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ISACOG), తెలంగాణలో కోవిడ్ వైరస్ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క రెండు కేసులను కనుగొంది.  దేశం మొత్తంమీద 70 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 23 మహారాష్ట్రలో, తమిళనాడులో 10, మధ్యప్రదేశ్లో 11, చండీఘర్ నుంచి 4, కేరళ మరియు కర్ణాటక నుండి మూడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి రెండు కేసులు నమోదయ్యాయి. పంజాబ్, గుజరాత్ మరియు ఉత్తర ప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, హర్యానా మరియు ఉత్తరాఖండ్ నుండి ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోకసభలో వెల్లడించారు.

ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,11,251 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 614 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1950 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,44,330కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 61, వరంగల్ అర్బన్ నుంచి 59,  ఖమ్మం జిల్లా నుంచి 47, మరియు నల్గొండ జిల్లా నుంచి 45 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,800కు పెరిగింది. అలాగే సాయంత్రం వరకు మరో 657 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,31,389 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించడానికి నమోదు చేసుకున్న రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆగస్టు 31 లోపు తమ ప్రాంగణంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. అలా చేయని పక్షంలో కోవిడ్ చికిత్సకు సంబంధించి ఆయా ఆసుపత్రుల లైసెన్స్ వెంటనే రద్దు చేయబడుతుందని పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

తెలంగాణలో కేసులు తగ్గుముఖంపడుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈరోజు పలు చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 100 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు నడుస్తున్నాయి. అయినప్పటకీ ప్రేక్షకుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తుంది.

(The above story first appeared on LatestLY on Jul 30, 2021 08:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).