Hyderabad, July 28: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి దాదాపు నాలుగు నెలల విరామం తరువాత ఆగస్టు 3 నుండి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ మరియు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి నాన్-కోవిడ్ సేవలను ప్రారంభించనుంది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్లో గాంధీ ఆసుపత్రిని కేవలం కోవిడ్ చికిత్సా కేంద్రంగానే మార్చింది. అప్పటినుంచి కోవిడ్ కాని సాధారణ రోగులందరికీ సేవలు ఆసుపత్రిలో నిలిపివేయవలసి వచ్చింది. ఇప్పుడు కేసులు తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి ఇతర వైద్య సేవలను కూడా ప్రారంభించాలని ఆసుపత్రి మేనేజ్మెంట్ నిర్ణయించింది.
ఇప్పటికీ చాలా మంది కోవిడ్ రోగులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున వారి కోసం రెండవ మరియు మూడవ అంతస్తులలో ఆర్థోపెడిక్ ఐసీయూను ఉపయోగించాలని మరియు ముకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసుల చికిత్సకు నాల్గవ అంతస్తును ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన ఆసుపత్రి ప్రాంతాలు మరియు వార్డులను సాధారణ నాన్-కోవిడ్ సేవలకు ఉపయోగించుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజా రావు సర్క్యులర్లో తెలిపారు. హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ ఆధారంగా కోవిడ్ మరియు నాన్-కోవిడ్ సేవలకు ఆసుపత్రిలోని వార్డులు, ఆపరేషన్ థియేటర్లు మరియు ఇతర ప్రాంతాలను సిద్ధం చేయాలని డాక్టర్ రాజా రావు నర్సింగ్ సూపరింటెండెంట్ మరియు హెల్త్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,16,815 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 657 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1413 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,43,093కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 77 కేసులు నిర్ధారణ కాగా, ఖమ్మం జిల్లా నుంచి 59, కరీంనగర్ నుంచి 64, వరంగల్ అర్బన్ నుంచి 62 మరియు పెద్దపల్లి, నల్గొండ జిల్లాల నుంచి 42 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,793కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 578 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,29,986 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,314 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.