Hyderabad, July 21: భారతదేశంలో ఇప్పటివరకు టీకాలు పొందిన లబ్ధిదారులందరి వివరాలు కోవిన్ పోర్టల్లో నిక్షిప్తం చేయబడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, ఇంటర్నెట్ సౌకర్యం మరియు తగిన గుర్తింపు కార్డులు లేకున్నా కూడా టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలా గుర్తింపు కార్డులు లేని వారికి కూడా ఇప్పటివరకు సుమారు 3.48 లక్షల డోసుల మేర టీకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఇంటర్నెట్ సౌకర్యం మరియు తగిన ఫోటో గుర్తింపు కార్డులు లేనివారు టీకా పొందటానికి కేంద్రం పలు మార్గాలను సూచించింది. ఇందులో భాగంగా, కోవిడ్-19 టీకా కేంద్రానికి (సీవీసీ) నేరుగా వెళ్లి తమ పేరు, చిరునామా తదితర వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేదా మొబైల్ ఫోన్లు లేని వారు తెలిసిన వారి మొబైల్ నంబర్ను ఉపయోగించి కోవిన్ ద్వారా టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ద్వారా నలుగురు పేర్లను నమోదు చేసుకోనే వీలు కల్పించారు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,14,260 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 691 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 594 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,38,721కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 85 కేసులు నిర్ధారణ కాగా, ఖమ్మం జిల్లా నుంచి 56, కరీంనగర్ నుంచి 55, మరియు సూర్యాపేట నుంచి 47 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,771కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 565 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,25,042 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.