Hyderabad, July 1: తెలంగాణలో సెకండ్ వేవ్ క్రమంగా తగుతోంది, మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది. ఈ జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు తెలిపారు. అలాగే ఆన్లైన్లో నమోదు చేసుకున్న18 ఏళ్లు పైబడిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆయన ధృవీకరించారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ 14 నుంచి 16 వారాలు అని, కోవాక్సిన్ కు అయితే నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో తీసుకోవచ్చని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసులను పరిశీలిస్తే, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,123 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 869 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1178 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,24,379కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 101 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 72, రంగారెడ్డి నుంచి 65 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 8 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,669కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1,197 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,07,658 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,052 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.