Rain Alert(Twitter)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు చేరింది. గ్రామాలు, పట్టణాల్లో వరద ధాటికి అంతర్గత రోడ్లు తెగిపోయి ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

ఒడిశా, దానికి ఆనుకుని ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్యంగా పయనించి సోమవారం సాయంత్రానికి బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి తూర్పుభాగం ఒడిశా మీదుగా వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి ఆదివారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని ఐఎండీ తెలిపింది.  వాయుగుండంగా మారిన అల్పపీడనం, తడిసి ముద్దైన ఏపీ, తెలంగాణ...తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు, జురాలకు సందర్శకుల తాకిడి

ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లిలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. కాగా, గత రెండు రోజులుగా విశాఖపట్నం, అనకాపల్లిలో భారీ వర్షాల కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే, అనకాపల్లిలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్‌. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల యాజమన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే.

భద్రాద్రి జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులకు వరద నీరు చేరింది. కిన్నెరసానిలో 16 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదలిపెట్టారు. 407 అడుగుల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 403.30 అడుగులు నీటిమట్టం ఉంది. సాయంత్రానికి ఆరు గేట్లు ఎత్తివేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో మొత్తం 25 గేట్లను ఎత్తి 92,121 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.  వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

గోదావరి వరద ప్రభావం వల్ల అక్కడ ఈతవాగు పొంగడంతో గుంపల్లి చర్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పర్ణశాలలో సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండలంలో గుబ్బలమంగి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో సున్నంబట్టి, కాశీనగరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ఇక జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌ మండల పరిధిలోని అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్‌కు(Medigadda Barrage) వరద ప్రవాహం(Heavy flood) పోటెత్తుతోంది.తెలంగాణతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో(Maharashtra) భారీ వర్షాలుHeavy rains) కురుస్తుండటంతో గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోమవారం బరాజ్‌ ఇన్‌ఫ్లో 8,68,850 క్యూసెక్కులకు పెరిగింది.

బ్యారేజీలో 85 గేట్లు ఎత్తి 8,68,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అన్నారం బరాజ్‌కు 17,200 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. భారీ వర్షాల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.