TS Budget Session 2022: రేప‌టితో తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగింపు, ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు
TS Assembly Monsoon Session 2020 (Photo-Telangana CMO Twitter)

Hyd, Mar14: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు (TS Budget Session 2022) ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అయితే నేడు జీరో అవర్ కూడా ఉంటుందని, సభ్యులు ప్రశ్నలు అడగాలని, ఉపన్యాసాలు ఇవ్వద్దని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటు, పోలీసు శాఖ ఆధునీక‌ర‌ణ‌, రాష్ట్రంలో విద్యుత్ రంగం, జీహెచ్ఎంసీ ప్రాంతంలో బ‌స్తీ ఆస్పత్రులు, వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ప్రీపెయిడ్ మీట‌ర్లు, వివిధ సంస్థ‌ల నుంచి రుణాలు, నిమ్మ‌కాయ‌ల నిల్వ కొర‌కు న‌కిరేక‌ల్ వ‌ద్ద శీత‌లీక‌ర‌ణ గిడ్డంగి వంటి అంశాల‌పై ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. కాగా మార్చి7న ప్రారంభ‌మైన బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రేప‌టితో బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్నాయి.

శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మండ‌లి చైర్మ‌న్‌గా సుఖేంద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌కు ఒకే ఒక్క నామినేష‌న్ రావ‌డంతో.. గుత్తా ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్లు మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని చైర్మ‌న్ సీటు వ‌ద్ద‌కు మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మ‌న్ సీటులో ఆశీనులైన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి మంత్రులు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.