COVID19 Second Wave: గతేడాది కంటే తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ కరోనా, తెలంగాణలో కొత్తగా 1498 కేసులు నమోదు , రాష్ట్రంలో 10 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak in TS (Photo Credits: IANS)

Hyderabad, April 06: తెలంగాణలో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది, గతేడాదితో పోలిస్తే కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. వైరస్ ఒకరినుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతూ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గతేడాది తొలి కేసు మార్చి 2, 2020లో నమోదైంది. అపుడు జూలై నాటికి రోజూవారీ కేసులు వెయ్యి మార్కును దాటాయి. అయితే ఈసారి మాత్రం మార్చి, 2021న తెలంగాణలో రోజూవారీ కేసులు 163 నమోదు కాగా, కేవలం వారాల వ్యవధిలోనే వెయ్యి మార్కును దాటేసి, రెండు వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది.

ఇలా పెరుగుతూపోతున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ల కారణంగా తెలంగాణలో అందరి చికిత్స కోసం అవసరమయ్యే హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాలు క్షీణించే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వయసు ప్రాధాన్యత ఆధారంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది, వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ మరియు స్వీయ నియంత్రణే మార్గం అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 62,350 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1498 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 1,866 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,14,735కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 313 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 164 కేసులు, రంగారెడ్డి నుంచి 128, నిజామాబాద్ నుంచి 142 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 6 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,729కు పెరిగింది.

అలాగే సోమవారం సాయంత్రం వరకు మరో 245 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,03,013 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,993 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 14 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.