Lights! Camera! Action! : జూన్ నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్, విధివిధానాలు రూపొందించాలని ఆధికారులకు ఆదేశాలు, సినిమా హాళ్లను తిరిగి తెరవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
Tollywood supremos meet CM KCR at Pragathi Bhavan | Photo: CMO

Hyderabad, May 23: లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం వల సినీరంగంను నమ్ముకొని పనిచేసే కార్మికులు పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి తిరిగి షూటింగ్స్ చేసుకోడానికి, థియేటర్లు తెరవడానికి అనుమతినివ్వాలని కోరుతూ సినీరంగంలోని ప్రముఖులు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. అంతకుముందు వీరంతా తెలంగాణ సినిమటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. సినిమా కష్టాలను తెలంగాణ మంత్రికి వివరించిన టాలీవుడ్ పెద్దలు

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్. శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి. కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు హాజరయ్యారు.

సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సూచించారు.

తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంలో కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని కేసీఆర్ అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు.

ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, దాని ప్రకారంగా సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామి ఇచ్చారు.