Andhra Pradesh Weather: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఏపీ తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Andhra Pradesh Weather) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.
Amaravati, July 21: ఏపీ తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Andhra Pradesh Weather) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఆంధ్రా తీరం వెంబడి ఉత్తర కోస్తాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఇది ఏర్పడొచ్చని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని సూచించింది. అల్పపీడనం కారణంగా కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం ఒడిశా తీరంలో ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు ప్రభావం చూపనుంది. 22, 23వ తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరించారు.
(The above story first appeared on LatestLY on Jul 21, 2021 05:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

