Agnipath Protests: అగ్నిపథ్ రిక్రూట్మెంట్ అంటే ఏమిటీ, ఈ పథకం ద్వారా సైన్యంలో చేరితే 4 ఏళ్ళ జీతభత్యాలు ఎలా ఉంటాయి, తరువాత ఎంత డబ్బు చేతికి వస్తుంది, నిరుద్యోగులు నిరసనలు ఎందుకు చేస్తున్నారు ?
కేంద్రం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు (Agnipath Protests) మిన్నంటుతున్నాయి. బీహార్ లో మొదలైన నిరసనలు దాదాపు అన్ని రాష్ట్రాలకు పాకాయి. ఈ స్కీం వెంటనే రద్దు చేయాలని యువత రోడ్డెక్కింది. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన ఈ స్కీంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
New Delhi, June 17: కేంద్రం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు (Agnipath Protests) మిన్నంటుతున్నాయి. బీహార్ లో మొదలైన నిరసనలు దాదాపు అన్ని రాష్ట్రాలకు పాకాయి. ఈ స్కీం వెంటనే రద్దు చేయాలని యువత రోడ్డెక్కింది. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన ఈ స్కీంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాగుందని అంటుంటే మరికొందరు దీనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు (Why Are Job Aspirants Protesting) దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ అగ్నిపథ్ పథకం అంటే ఏంటి, అందులో ఏముంది. ఎలా రిక్రూట్ మెంట్ చేస్తారు.. ఈ విషయాలు ఓ సారి చూద్దాం.
భారత రక్షణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం భారత సైన్యంలో యువతకు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకమే అగ్నిపథ్. ఈ పథకంలో (Army Recruitment Scheme) భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేస్తారు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.
అగ్నిపథ్ కింద సైన్యంలో చేరాలనుకునే వారికి పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. తాజాగా ఈ వయసును 23కి పెంచింది కేంద్రం. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో సైనికుని చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్లో జమచేస్తారు. ఇక రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36,500లో 10,980 కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. అలాగే నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12, 000 కార్పస్ ఫండ్కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5 లక్షల రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్లో జమ అవుతాయి.
దీనికి కేంద్రం మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చే సైనికునికి 11.71 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం వారికి ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.
ఇక సైనికుడు సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. అలాగే సైన్యంలో పనిచేస్తున్న సమయంలో శారీరక వైకల్యం సంభవిస్తే నష్ట పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.
రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చెప్పిన దాని ప్రకారం.. ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటూ దేశ రక్షణ బలోపేతం అవుతుందని అన్నారు. సైన్యంలో చేరాలన్న చాలామంది యువకుల కల సాకారమవుతుందని చెప్పారు. భారత సైన్యాన్ని మరింత యూత్ఫుల్గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం యువత సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు.
దీనిపై నిరసన ఎందుకు చేస్తున్నారు. ప్రముఖులు ఏమంటున్నారు.
నిరుద్యోగుల వ్యతిరేకతకు ప్రధాన కారణం సాయుధ బలగాల్లో పనిచేసే కాలం నాలుగేళ్లకు తగ్గిపోతుండటమే. నాలుగేళ్లు డిఫెన్స్లో పనిచేసిన తర్వాత తమకు ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నాలుగేళ్ల తర్వాత ఈ స్కీమ్ నుంచి బయటకు వచ్చేసినవారికి పెన్షన్ కూడా ఉండదు. మరోవైపు వయస్సు పరిమితి కూడా తక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అగ్నిపథ్ స్కీమ్ పట్ల సంతోషంగా లేని నిరుద్యోగులు అల్లర్లకు దిగుతున్నారు. ఆర్మీలో చేరడానికి తాము కొన్నేళ్లుగా కష్టపడుతున్నామని, కానీ నాలుగేళ్ల గడువుతో నియామకాలు చేపట్టడం తమకు అన్యాయం చేసినట్టవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదట బీహార్లో మొదలైన నిరసన కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు పాకాయి. ఇక నిరుద్యోగుల్లో ఉన్న అనుమానాలు, సందేహాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. నాలుగేళ్లు అగ్నివీర్లుగా పనిచేసిన తర్వాత ఏమేం చేయొచ్చో ప్రభుత్వం వివరించింది. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్, రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఫోర్స్లో చేరొచ్చని తెలిపింది. అగ్నిపథ్ స్కీమ్పై ఉన్న అపోహల్ని, వాస్తవాలను వివరించింది.
డబ్బును ఆదా చేయడం మంచిదే కానీ రక్షణ దళాలను పణంగా పెట్టి చేయకూడదని రిటైర్డ్ మేజర్ జనరల్ షియోనన్ సింగ్ అన్నారు. మేము ఏదో చేశామని, నిర్ణయాలు తీసుకునే పార్టీగా నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోందని ఆయన అన్నారు. దీన్ని ఆయన మూర్ఖపు చర్యగా పేర్కొన్నారు.ఇక భారత సైన్యం పై జీతం, పెన్షన్ భారాన్ని తగ్గించడమే ఈ పథకాన్ని తీసుకురావడంలో ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని చాలామంది భావిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 17, 2022 03:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

