YS Jagan Comments on COVID-19: బ్లీచింగ్ పౌడర్‌తో కరోనాను తరిమేయండి, ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు, కరోనా మాటలను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

Amaravati,Mar 16: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (CoronaVirus) వ్యాధిపై ఏపీ సీఎం జగన్ (AP CM YS jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదని, అంతగా భయపడాల్సిన పని లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందన్నారు.

ఏపీలో కరోనా లేదు, ఎన్నికలను యథాతథంగా కొనసాగించండి

కరోనాతో మనుషులు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనాకి మందు(మెడికేషన్) పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్పిన సీఎం జగన్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా వైరస్ చనిపోతుందన్నారు.

కాగా చైనాలో (China) 85వేల మందికి కరోనా వస్తే 65వేల మందికి నయం అయ్యిందని వారంతా బయట తిరుగుతున్నారని జగన్ చెప్పారు. 60ఏళ్లు పైబడిన వారికి అందునా బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ, లివర్, గుండె సమస్యలతో బాధపడుతున్న వారికే కరోనా ముప్పు ఎక్కువగా ఉందని సీఎం జగన్ అన్నారు.

ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో 81శాతం ఇంట్లోనే ఉంటూ రికవర్ అయ్యారని తెలిపారు. కేవలం 13.8శాతం కేసులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. కేవలం 4.7శాతం కేసులు మాత్రమే క్రిటికల్ అంటే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని సీఎం వెల్లడించారు.

Here's AP CM Comments on COVID-19

జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లకపోవడమే మంచిదని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సినిమా థియేటర్లకు, షాపింగ్ మాల్స్ కు వెళ్లాలని సూచించారు. ఇలాంటి ప్రక్రియ ఏ వారమో రెండు వారాలో కొనసాగేది కాదని, మరో ఏడాది పాటు ఇవన్నీ జరగాల్సిన కార్యక్రమాలు అన్నారు.

అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా బాధితులు ఉంటే, ఇంట్లో వారి సామాన్లు ఎలా డిస్పోజ్ చేయాలో కుటుంబసభ్యులకు నేర్పిస్తామని జగన్ చెప్పారు. కరోనా బాధితులు వాడిన దుస్తులు లేదా సామాన్లపై బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుందన్నారు. అలా 6 గంటల పాటు బ్లీచింగ్ పౌడర్ ఉంటే కరోనా వైరస్ (COVID-19) చనిపోతుందని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రాష్ట్రంలో కొనసాగుతాయన్నారు.

అయితే సీఎం జగన్ కామెంట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కరోనాపై మాట్లాడిన మాటలను జగన్ వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ప్రజల ప్రాణాలకంటే మీకు ఎన్నికలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అని జగన్ ను ప్రశ్నించారు.

కరోనా వైరస్ పై ముఖ్యమంత్రిగా మొదటి మీడియా సమావేశం నిర్వహించి జగన్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. కరోనాను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 5వేల 500మంది కరోనాతో చనిపోయారని చంద్రబాబు చెప్పారు.