Coronavirus in India: డెల్టా వేరియంట్తో ప్రపంచం మళ్లీ డేంజర్ జోన్లోకి, హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్, దేశంలో కొత్తగా 43,071 కరోనా కేసులు, ఊబకాయులకు కరోనాతో అంత ప్రమాదం లేదని తేల్చిన అధ్యయనం
దేశంలో కరోనావైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కేసులు (India logs 43,071 new COVID-19 cases) వెలుగులోకివచ్చాయి.
New Delhi, July 4: దేశంలో కరోనావైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కేసులు (India logs 43,071 new COVID-19 cases) వెలుగులోకివచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్యలో (Covid Deaths) మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. నిన్న 18,38,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య 41.28 కోట్లకు చేరింది. క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కాస్త పెరిగింది.
గడిచిన 24 గంటల్లో 955 మంది కరోనాతో (Coronavirus) చికిత్స పొందుతూ మరణించగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,02,005కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 52,299 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,96,58,078కి చేరి.. ఆ రేటు 97.09 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,85,350 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న 63,87,849 మందికి టీకాలు అందించారు. వీటితో కలిపి ఇప్పటి వరకూ 35,12,21,306 టీకా డోసులు పంపిణీ చేశారు.
పురుషులు, శరీర బరువు ఎక్కువగా ఉన్న కొవిడ్-19 బాధితులకు మరణం ముప్పు ఎక్కువంటూ జరిగిన విశ్లేషణలను తాజా అధ్యయనం ఖండించింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 44,305 మందితో సాగిన 58 అధ్యయనాలను విశ్లేషించి, ఈ మేరకు తేల్చారు. ఐసీయూలో చేరిన కొవిడ్ బాధితుల్లో పొగతాగేవారికి 40 శాతం, అధిక రక్తపోటు ఉన్నవారికి 54 శాతం, మధుమేహం ఉన్నవారికి 41 శాతం, శ్వాస సంబంధ రుగ్మతలున్నవారికి 75 శాతం మేర మరణం ముప్పు ఎక్కువని వెల్లడైంది.
వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వంటి కరోనా వైరస్ వేరియంట్లతో ప్రపంచం గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ చెప్పారు. తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో ఆస్పత్రులు మరోసారి నిండిపోతున్నాయంటూ శుక్రవారం ఆయన హెచ్చరించారు. ‘‘డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో చాలా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.
ఏ దేశమూ దీన్నుంచి బయటపడలేదు. ఈ వేరియంట్లో ఉత్పరివర్తన (మ్యుటేషన్) జరుగుతూనే ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారుతోంది. అందుకు తగ్గట్టుగా దేశాలన్నీ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసుకుని సిద్ధంగా ఉండాలి’’ అని సూచించారు.
ఇప్పటివరకు 98 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించిందని, దీని ప్రభావం, వ్యాప్తిని తగ్గించేందుకు రెండు మార్గాలున్నాయని టెడ్రోస్ తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్తో వైరస్ మ్యుటేషన్లను ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ.. ఐసోలేషన్, చికిత్స వసతులు మెరుగుపరచాలి. అలాగే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలని వివరించారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి అన్ని దేశాల్లో 70శాతం మందికి టీకాలు అందించేలా ప్రపంచ నేతలంతా కలిసి పనిచేయాలని టెడ్రోస్ మరోసారి పిలుపునిచ్చారు.
(The above story first appeared on LatestLY on Jul 04, 2021 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

