Farmers' Agitation Called Off: ఉద్యమాన్ని విరమించుకున్న రైతులు, మాట తప్పితే మళ్ళీ ఆందోళన తప్పదని కేంద్రానికి హెచ్చరిక, రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటున్నామని కేంద్రం లేఖ
సుదీర్ఘ కాలంపాటు సుమారు 370 రోజులపాటు సాగిన రైతుల నిరసనలు ఎట్టకేలకు ముగిశాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కొనసాగిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు (Farmers' Agitation Called Off) రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు ప్రభుత్వం ముందు ఉంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఈ ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.
New Delhi, Dec 9: సుదీర్ఘ కాలంపాటు సుమారు 370 రోజులపాటు సాగిన రైతుల నిరసనలు ఎట్టకేలకు ముగిశాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కొనసాగిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు (Farmers' Agitation Called Off) రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు ప్రభుత్వం ముందు ఉంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఈ ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. తాము డిసెంబరు 11 శనివారం తమ నిరసన కార్యక్రమాలను విరమించి, తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటామని రైతు సంఘాలు (Farm Unions) గురువారం ప్రకటించాయి.
గురువారం సాయంత్రం 5.30 గంటలకు విజయోత్సవ ప్రార్థనను నిర్వహించనున్నట్లు తెలిపాయి. శనివారం ఉదయం 9 గంటలకు సింఘు, టిక్రి నిరసన స్థలాల వద్ద విజయోత్సవ కవాతును కూడా నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ నెల 13న పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించాలని పంజాబ్ రైతులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే మళ్లీ ఆందోళన తప్పదని రైతు సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా కేంద్రాన్ని హెచ్చరించింది. రైతులు పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినందు వల్లే ఆందోళనను ఉపసంహరించుకున్నామని (Farmers protest suspended after 378 days), ఒకవేళ కేంద్రం కనుక తమ డిమాండ్లను ఆచరణలో పెట్టకపోతే ఆందోళన మళ్లీ చేపడతామని స్పష్టం చేశారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీ ఏర్పాటు, రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించడంపై ప్రభుత్వం ఓ లేఖను రైతు సంఘాలకు అందజేసింది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలు ఏమిటంటే, నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించేందుకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా ఇటువంటి కేసులను ఉపసంహరించాలని ఇతర రాష్ట్రాలను కూడా కేంద్రం కోరనుంది.
నిరసన కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంపై ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఎంఎస్పీపై కమిటీలో సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఎంఎస్పీపై ప్రస్తుత విధానం కొనసాగుతుంది. విద్యుత్తు బిల్లుపై సంబంధితులందరితోనూ, సంయుక్త కిసాన్ మోర్చాతోనూ చర్చించిన తర్వాత మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం అంగీకరించింది.
సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం అనంతరం రైతు నేత గుర్నామ్ సింగ్ చరుని గురువారం మీడియాతో మాట్లాడుతూ, ‘‘మా ఆందోళనను నిలిపివేయాలని నిర్ణయించాం. జనవరి 15న సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోకపోతే, మా ఆందోళనను పునరుద్ధరిస్తాం’’ అని చెప్పారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తమకు కొన్ని హామీలను ఇచ్చిందని, అందుకే తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
ఇదే విషయాన్ని మరో రైతు నేత బల్వీర్ రాజేవాల్ కూడా నొక్కి చెప్పారు. ప్రస్తుతానికైతే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ బార్డర్లోని టెంట్లను తొలగిస్తున్నామని, తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సన్నద్ధమవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఈ సింఘూ సరిహద్దు ప్రాంతాలను తాము శుక్రవారం సాయంత్రం నుంచి ఖాళీ చేయడం ప్రారంభిస్తామని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Dec 09, 2021 04:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

