India Covid Update: కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు సజీవ దహనం, దేశంలో కొత్తగా 2 ,61,500 మందికి కరోనా నిర్ధారణ, తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్
దేశంలో కొత్తగా 2,61,500 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 1,38,423 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,88,109కు (India Covid Update) చేరింది.
New Delhi, April 17: దేశంలో కొత్తగా 2,61,500 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 1,38,423 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,88,109కు (India Covid Update) చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 1,501 మంది కరోనా కారణంగా మృతి (Coronavirus Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,77,150కు పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus Outbreak) నుంచి ఇప్పటివరకు 1,28,09,643 మంది కోలుకున్నారు. 18,01,316 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,26,22,590 మందికి వ్యాక్సిన్లు వేశారు.
ఢిల్లీ రాష్ట్రంలో పరిస్థితి చాలా సీరియస్గా ఉందని సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేదని అన్నారు. రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్ తదితర ముఖ్యమైన మందుల కొరత ఉందని అంగీకరించారు. తగినంత ఆక్సిజన్, ఔషధాలు వెంటనే సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్కు విజ్ఞప్తి చేశామని అన్నారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు పడకలు దొరకడం లేదని చెప్పారు. పడకలు ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులను హెచ్చరించారు.
కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 12,25,02,790 కోవిడ్ టీకా డోసులను అర్హులకు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం 92వ రోజుకు చేరిందని, శనివారం ఒక్కరోజే 25.65 లక్షల డోసులు ఇచ్చినట్లు తెలిపింది. 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న వారిలో 4.04 కోట్ల మంది మొదటి డోసు, 10.76 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని స్పష్టం చేసింది. 60 ఏళ్ల పైబడిన వారిలో 4.55 కోట్ల మంది మొదటి డోసు, 38.77 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని వివరించింది.
చత్తీస్ఘడ్లోని కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు రోగులు సజీవ దహనమయ్యారు. ఫ్యాన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఆస్పత్రి అంతా చుట్టుముట్టింది. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊపిరి ఆడక నలుగురు కరోనా రోగులు మృతిచెందారు. ఈ ఘటనకు కారణాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై సీఎం భూపేశ్ భాగేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు.
రాజస్థాన్లోని రెండవ అతిపెద్ద పట్టణమైన జోధ్పూర్లో శనివారం ఒక్కరోజే కొత్తగా 1200 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల వ్యవధిలో జోద్పూర్లో కరోనాతో 38 మంది మృతి చెందారు. తాజాగా నమోదవుతున్న కేసులలో యువత, చిన్నారులు అధికంగా ఉంటున్నారు.
తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవానులు కరోనా బారిన పడ్డారు. దీనికిముందు 21 మంది జవానులు కరోనా బారినపడ్డారు. వీరంతా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో ఐసోలేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నైట్ కర్ఫ్యూను అదనంగా మరో రెండు గంటలు పొడిగించారు. దీంతో ఇకపై సాయంత్రం 5 గంటలకల్లా దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాలు మరో మై లురాయిని చేరుకున్నాయి. ఈ మహమ్మారి బలితీసుకున్న వారి సంఖ్య 30 లక్షలు దాటింది. నిరుడు సెప్టెంబరు 28 నాటికి పది లక్షల మార్కును దా టిన మరణాలు.. ఆ తర్వాత కాస్తంత నెమ్మదించి ఈ ఏడాది ఫిబ్రవరి 21 నాటికి 20 లక్షల మార్కు ను చేరుకున్నాయి. అంటే.. రెండో 10 లక్షల మరణాలకు 5 నెలల సమయం పట్టింది. రోజుకు సుమారు 6600 మంది కొవిడ్కు బలయ్యారు. చివరి పది లక్షల మరణాలు కేవలం 54 రోజుల్లోనే సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, మెక్సికో, భారత్.. మొత్తం మరణాల్లో దాదాపు సగం.. ఈ నాలుగు దేశాల్లోనే సంభవించడం గమనార్హం.
భారత్ కేసుల పెరుగుదలపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించకపోవడం, రూపు మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం దేశంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలని వెల్లడించారు. వ్యాక్సినేషన్ జరుగుతోందన్న ధీమాతో ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని వివరించారు. కరోనా విస్తరిస్తుంటే దేశంలో మత సంబంధ కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నికలు, మత కార్యక్రమాలను ఆంక్షలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ వయోపరిమితిని సడలిస్తూ వెళ్లాలని, తద్వారా అత్యధికులకు వ్యాక్సిన్ అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్ లో ముగిసిన కుంభమేళాకు నిత్యం లక్షల మంది విచ్చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తికి కుంభమేళా కారణమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
(The above story first appeared on LatestLY on Apr 18, 2021 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

