Indian Navy Bans Smartphones: సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ నేవీ, స్మార్ట్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌పై నిషేధం, నేవీ స్థావరాల్లో సోషల్ మీడియాను ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసిన నేవీ ఉన్నతాధికారులు
Indian Navy puts ban on use of Facebook and smartphones within the naval areas (photo-wikimedia commons)

New Delhi, December 30: భారత నౌకాదళం (Indian Navy) తన సిబ్బందికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేవి సిబ్బంది ఇకపై సోషల్‌ మాధ్యమాలు (Social Media Apps) అయిన ఫేస్‌బుక్‌,(Facebook) ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లు (WhatsApp) వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. భారత నౌకాదళానికి చెందిన బోర్డు నౌకలు, వైమానిక స్థావరాల్లో సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లను (Smart Phones) కూడా అనుమతించమని ఓ ప్రకటనలో భారత నైకాదళం పేర్కొంది.

ఇటీవల యువతుల వలలో చిక్కి నేవీ రహస్యాలను పాకిస్థాన్‌ దేశానికి చేరవేస్తున్న ఏడుగురు నౌకాదళ సిబ్బందిని విశాఖలో (Visakha) నేవీ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేశ భద్రత దృష్ట్యా.. ఇండియన్‌ నేవీలో స్మార్ట్‌ ఫోన్లను నిషేధిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. నావికాదళ ప్రాంతాలు, వేదికల్లో స్మార్ట్‌ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. నేవీ సిబ్బంది సోషల్‌ మీడియా మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించరాదు అని నేవీ అధికారులు స్పష్టం చేశారు.

Here's ANI Tweet

దేశ రక్షణ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు (PAK) చేరవేసే వ్యక్తులను నేవీ సిబ్బంది డిసెంబర్ 20న అరెస్టు చేశారు.ఇండియన్ నేవీలో 2017లో చేరిన ఈ ఉద్యోగులు 2018లో ఫేస్‌బుక్‌ ద్వారా హనీట్రాప్‌లో (Honey Trap) చిక్కుకున్నట్లు గుర్తించారు. పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ హనీ ట్రాప్‌లో చిక్కుకున్న వీళ్లు.. హవాలా సొమ్ముకు ఆశపడి దేశ రహస్యాలను వారికి చేరవేసినట్టు అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

గత నెల రోజులుగా చేపట్టిన ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌లో (Operation Dolphin's Nose) భాగంగా నిందితులు చిక్కారు. వీరిని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. జనవరి 3వ తేదీ వరకూ కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఏపీ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను జరిపాయి. ఇందులో ఏడుగురు నేవీ సిబ్బంది, ఒక హవాలా వ్యక్తిని అరెస్ట్ చేశారు.భారత నావికాదళం రహస్యాలను తెలుసుకొనేందుకు సోషల్ మీడియాను ఉపయోగించారని గుర్తించిన భారత నేవీ ఉన్నతాధికారులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.