
Hyderabad, FEB 27: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల (Ration Cards) కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్. మరికొన్ని రోజుల్లో రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు భావిస్తోంది. ముందుగా మార్చి 1న లక్ష కార్డులు జారీ చేయనున్నట్టు ఇప్పటికే సర్కారు ప్రకటించింది. అయితే, ఆ రోజున రేషన్ కార్డుల జారీ కుదరకపోవచ్చు. మార్చి తొలివారం అనంతరం కొత్తకార్డుల జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టు అధికార యంత్రాంగం అంటోంది. ఫిబ్రవరి 28 వరకే మీ సేవలో (MEE Seva) దరఖాస్తులకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగంలో కార్మికుల గల్లంతు విషయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ తీరిక లేకుండా ఉన్నారు. దీంతో కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలి? అనే అంశంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మార్చి 1న కొత్త రేషన్ కార్డుల జారీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
స్మార్ట్ కార్డు (Smart Card) రూపంలో రేషన్ కార్డులు అందుబాటులోకి తేవాలని సర్కారు అనుకుంటోంది. వీటిని సర్కారు నుంచి ఇంకా ఆమోద ముద్ర పడలేదు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి. స్మార్ట్ కార్డుల తయారీకి టెండర్లు పిలవడం వంటివి చేయాలి. దీంతో మరో పది రోజుల వరకు ఈ పనులన్నీ జరగకపోవచ్చని తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలలోపే కొత్త రేషన్కార్డుల ఇవ్వాలని సర్కారు అనుకుంటోంది. తెలంగాణ ప్రస్తుతం 89 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇప్పుడు తొలి దశలో 3 – 4 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.