Mann Ki Baat Highlights: వ్యవసాయరంగం తనను తాను కాపాడుకుంది, కరోనా ప్రభావం దానిపై లేదు, మన్ కీ బాత్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
గత శతాబ్ద కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద మహమ్మారి కరోనానే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఇతర దేశాల ఒత్తిడిలకు లోబడి లేదని, స్వీయ సంకల్పంతోనే ముందుకు నడుస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
New Delhi, May 30: గత శతాబ్ద కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద మహమ్మారి కరోనానే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఇతర దేశాల ఒత్తిడిలకు లోబడి లేదని, స్వీయ సంకల్పంతోనే ముందుకు నడుస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ రోజు తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో (Mann Ki Baat) ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్-19 మహమ్మారిపై (Coronavirus) పోరాటం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
దేశం తన సంపూర్ణశక్తియుక్తులతో కోవిడ్-19పై పోరాడుతోందని పేర్కొన్నారు. తౌక్టే, యాస్ తుఫాను, స్వల్ప భూకంపాల గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. విపత్తులు అనేక రాష్ట్రాలను ప్రభావితం చేశాయన్నారు. అయినప్పటికీ ప్రజలు ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. అలాగే గతంతో పోలిస్తే ఆస్తి, ప్రాణ నష్టం భారీగా తగ్గించగలిగామని తెలిపారు. ఈ విపత్తుల సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. తుపానుకు ప్రభావితమైన అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ సంక్షోభ సమయంలో ఎంతో సహనంతో, క్రమశిక్షణతో ధైర్యాన్ని చూపించిన తీరును కొనియాడారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అన్నీ కలిసి పనిచేస్తున్నాయన్నారు.
కరోనా నేపథ్యంలో వైద్యులు, నర్సులతో పాటు ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లు చేస్తున్న కృషిని మోదీ మరోసారి ప్రశంసించారు. వారు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సేవలు కొనసాగించారని తెలిపారు. రెండో దశ విజృంభణ సమయంలో ఆసుపత్రులకు తాకిడి పెరగడంతో ఆక్సిజన్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని గుర్తు చేశారు. ఇది పెద్ద సవాల్గా నిలిచిందన్నారు. అలాగే ఆక్సిజన్ సరఫరాలో అనేక ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్, క్రయోజనిక్ ట్యాంకర్ల డ్రైవర్లు, ఎయిర్ఫోర్స్ పైలట్లు విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది డ్రైవర్ల పేర్లు ప్రస్తావించిన ప్రధాని.. వారి సేవల్ని అభినందించారు.
ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరాలో వైమానిక దళం కూడా ప్రధాన పాత్ర పోషించింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ పట్నాయక్ ప్రధాని మోదీతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సహాయ పడటమనేది తమకు దక్కిన గొప్ప అదృష్టమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని అన్నారు. కొన్నేళ్లుగా దేశం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా-విశ్వాస్' అనే మంత్రంతో నడుస్తున్నదన్నారు.
గడచిన ఈ ఏడు సంవత్సరాలలో సాధించిన విజయాలు దేశానివని, దేశ ప్రజలవని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు స్వీయ సంకల్పంతోనే ముందుకు నడుస్తున్నదని అన్నారు. దేశంపై ఇతర దేశాల ఆలోచనలు, ఒత్తిడిలు లేకుండా ముందుకు సాగుతున్నందుకు మనమందరం గర్వపడాలన్నారు. జాతీయ భద్రతా సమస్యలపై భారత్ రాజీపడబోదని, మన త్రివిధ దళాల బలం పెరిగిందని, ఈ కారణంగానే దేశం సరైన మార్గంలో ఉంది భావిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టినట్లు మోదీ తెలిపారు. విదేశాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లు దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ క్రమంలో రోజుకు 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నేడు 9500 మెట్రిక్ టన్నులకు పెంచామని తెలిపారు. దాదాపు 10 రెట్లు ఉత్పత్తి పెరిగిందన్నారు.
కరోనా మూలంగా దేశంలో ప్రతి రంగం దెబ్బతిందని.. అయితే, సంక్షోభ సమయంలో వ్యవసాయం రంగం తనని తాను కాపాడుకోవడంతో పాటు ఇంకా పురోగతి సాధించిందని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో కూడా సాగు దిగుబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయన్నారు. కొన్ని పంటలకు ఈసారి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ప్రతిఫలం లభించిందన్నారు. రైతుల కృషి వల్లే ఈరోజు దేశంలో దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించగలుగుతున్నామన్నారు.
నేటితో భాజపా సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం ఈ దేశం, ఈ దేశ ప్రజలకే చెందుతుందన్నారు. ఈ సమయంలో దేశం గర్వించదగ్గ అనేక విజయాలు అందుకున్నామని తెలిపారు. ఇతర దేశాల ఒత్తిడితో కాకుండా నేడు దేశం తన సొంతం వ్యూహాలతో ముందుకు సాగుతోందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగడం, మన దేశంపై కుట్రలు చేసే వారికి దీటుగా జవాబు చెప్పడం వంటి ఉదంతాల్ని చూస్తే మనం సరైన దిశగా వెళుతున్నట్లే అర్థమవుతోందన్నారు.
దేశంలోని ప్రతి గ్రామానికీ ఇప్పుడు విద్యుత్తు చేరిందని.. జల్ జీవన్ మిషన్ కింద గత 21 నెలల్లో నాలుగున్నర కోట్ల ఇళ్లకు తాగునీరు అందించినట్లు వివరించారు. ఆయుష్మాన్ భారత్ కింద అనేక మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ పథకం ద్వారా చికిత్స అందుకున్న అనేక మంది తమకు కొత్త జీవితం లభించినట్లు భావిస్తున్నారన్నారు. స్వచ్ఛతపైనా ప్రతి ఒక్కరికీ అవగాహన ఏర్పడిందన్నారు.
(The above story first appeared on LatestLY on May 30, 2021 01:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

