Maharashtra Political Drama: సత్యమే గెలుస్తుందన్న సంజయ్ రౌత్, అధికారంలోకి వస్తే బీజేపీ నేతలకు పిచ్చాసుపత్రిని నిర్మిస్తామన్న శివసేన ఎంపీ, సీఎం ఫడ్నవిస్ కోసం పరుగులు పెట్టిన అజిత్ పవార్, థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న మహా రాజకీయాలు
Sena’s Sanjay Raut Welcomes SC Order on Maharashtra Floor Test (Photo-Facebook)

Mumbai, November 26: సుప్రీంకోర్టు(Supreme Court) మహారాష్ట్ర రాజకీయాల(Maharashtra Politics) పై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీలన్నీ ఉరుకులు పరుగుల మీద సమావేశాలు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాయి. అసెంబ్లీలో రేపు బలపరీక్ష (Maharashtra Floor Test Tomorrow)ద్వారా మెజార్టీని ప్రూవ్ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు అలర్ట్ అయ్యాయి. బీజేపీ(BJP) బలాన్ని నిరూపించుకునేందుకు ఎమ్మెల్యేలు అవసరమైన నేపథ్యంలో ఆ పార్టీ రాయబారాలు నడిపే పనిలో పడింది.

ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ (Ajit Pawar)  ఆఘమేఘాల మీద బీజేపీ నేత, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇంటికి చేరుకున్నారు. రేపు బలాన్ని ఎలా నిరూపించుకోవాలనే దానిపై వీరిద్దరూ చర్చలు జరపనున్నారు. అజిత్ పవార్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ (Sharad Pawar) గూటికి చేరడంతో బీజేపీ ఇప్పుడు మెజార్టీ కోసం ఏం వ్యూహాలు రచిస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది.

ఫడ్నవిస్ ఇంటికి అజిత్ పవార్

ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay Raut) సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని తెలిపారు. కోర్టు 30 గంటల సమయం ఇచ్చిందని, అయితే మేము కేవలం 30 నిమిషాల్లోనే బలాన్ని ప్రూవ్ చేసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీజేపీపై విరుచుకుపడ్డారు. అధికారం లేకపోతే బిజెపి నేతలకు పిచ్చెక్కుతుందని, తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం వారికోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని శివసేన నేత సంజరు రౌత్‌ వ్యాఖ్యానించారు.

ANI Tweet

బిజెపి రెండు న్నరేళ్ల ముఖ్యమంత్రి పీఠాన్ని అజిత్‌పవార్‌తో పంచుకునేందుకు సిద్ధమైందని, కాని శివసేనతో ఈ ఒప్పందానికి ఎందుకు అంగీకరించలేదని ఆయన ప్రశ్నించారు. తమ కూటమి మెజారిటీని నిరూపించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సభలో మెజారిటీ నిరూపించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి పేర్లతో కూడిన జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించనున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు.

మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై రౌత్‌ స్పందిస్తూ.. వారికి మెజారిటీ లేకపోయినా 'చంబల్‌ బందిపోటు దొంగల' మాదిరిగా అర్థరాత్రి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.

శనివారం బిజెపినేత ఫడ్నవీస్‌, ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్‌సిపి ఎమ్మెల్యేలు కొందరు కనిపించకుండా పోయారని, వారిని బిజెపి లేదా బిజెపి పాలిత రాష్ట్రానికి చెందిన హర్యానా పోలీసులు నిర్బంధించారని రౌత్‌ అన్నారు. అధికారాన్ని పొందేందుకు బిజెపి ఎంతకైనా తెగిస్తుందని, హర్యానాలోని గుర్గావ్‌ వద్ద ఒక హోటల్‌ నుండి సేన కార్యకర్తలు ఎన్‌సిపి ఎమ్మెల్యేలను రక్షించారని అన్నారు.