
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన 2 మ్యాచుల్లో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్తాన్ రిజ్వాన్ సేన.. మూడో దాంట్లోనైనా గెలుస్తుందేమోనని భావిస్తే అక్కడా వరుణుడు అడ్డు పడ్డాడు.దీంతో చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని పాకిస్థాన్ ఒక్క గెలుపు కూడా లేకుండానే ముగించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన దాయాది జట్టు.. గ్రూప్ స్టేజ్లో భాగంగా న్యూజిలాండ్, టీమిండియాతో జరిగిన మ్యాచుల్లో ఓడి ఇంటిముఖం పట్టింది.
దీంతో బంగ్లాదేశ్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లోనైనా గెలిచి అభిమానులకు ఊరట కలిగించాలని అనుకుంది. కానీ వరుణుడు అడ్డుపడి రిజ్వాన్ సేన ఆశలపై నీళ్లు చల్లాడు. వాన కారణంగా పాక్-బంగ్లా మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఎడతెరపి లేని వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న రావల్పిండిలో ఉదయం నుంచి వాన కురిసింది. గ్రౌండ్ చిత్తడిగా మారడం, ఔట్ఫీల్డ్ జలమయం కావడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు అంపైర్లు. పాక్తో పాటు బంగ్లా కూడా ఒక్క విజయం లేకుండానే టోర్నమెంట్ను ముగించింది.