IPL 2020 Sponsorship Deal: డ్రీమ్‌ 11 కంపెనీకి ఐపీఎల్ 13వ సీజన్‌ హక్కులు, రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న డ్రీమ్‌ 11, నాలుగు నెలల 13 రోజుల పాటు ఐపీఎల్ 13 స్పాన్సర్‌ గా కొనసాగనున్న కంపెనీ
Dream11 (Photo Credits: IANS)

ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌కు సంబంధించిన హక్కులను (IPL 2020 Sponsorship Deal) 250 కోట్ల రూపాయలకు డ్రీమ్‌ 11 కంపెనీ (Dream11) దక్కించుకుంది..ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ (IPL 2020 Sponsorship) హక్కుల కోసం రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది.

డ్రీమ్‌ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ హక్కులను దక్కించుకుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. డ్రీమ్‌ 11 నాలుగు నెలల 13 రోజుల పాటు ఐపీఎల్ 13 స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప‌తంజ‌లి, అడిడాస్‌, జియో క‌మ్యూనికేష‌న్స్‌, అన్అకాడ‌మీ, టాటా గ్రూప్‌ తదితర దిగ్గజ కంపెనీలు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీపడ్డాయి.

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లోనే చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో 5 ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. నాలుగున్నర నెల‌ల గ‌డువు కోసం వివో (రూ. 440 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాల్సి ఉంది.

2018 నుంచి 2022 వ‌ర‌కు ఐపీఎల్ స్పాన్స‌ర్‌గా వివో ఉన్న‌ప్ప‌టికీ.. స‌రిహ‌‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చైనా కంపెనీల‌ను బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ల మేర‌కు చైనా మొబైల్ కంపెనీ స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్-13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్, షార్జా, అబుధాబిలో నిర్వహించనున్నారు.