Uttarakhand Glacier Burst: ఉత్తరాఖండ్ జల విలయం, మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించిన పంత్, ఈ మొత్తాన్ని అక్కడి సహాయ చర్యల కొరకు అందిస్తానంటూ ట్వీట్
Rishabh Pant (Photo Credits: IANS)

New Delhi, February 8: టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ ఉత్తరాఖండ్‌ జల విలయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో కార్మికులు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ జలప్రళయం (Uttarakhand Glacier Burst) సందర్భంగా సహాయ చర్యల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని రిషబ్ (Rishabh Pant) ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పంత్‌ ట్వీట్‌ చేశాడు.

ధౌలిగంగా ఘటన చోటుచేసుకోవడం ఎంతో కలచివేసింది. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. నా వంతు సాయంగా తొలిటెస్ట్‌ మ్యాచ్‌ ఫీజును విరాళంగా అందిస్తున్నాను. ఈ మొత్తాన్ని అక్కడి సహాయ చర్యల కొరకు అందిస్తాను.’ అని భావోద్వేగంగా ట్వీట్‌ చేశాడు.

అంతేకాకుండా  రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా ట్విటర్‌ వేదికగా పంత్‌ కోరాడు. కాగా చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో (India vs England) పంత్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. 88 బంతుల్లో 91; (9 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక ఇన్సింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు.

హరిద్వార్ జిల్లా రూర్కీ పట్టణంలో రిషబ్ పంత్ జన్మించారు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఆదివారం ట్వీట్ చేశారు.ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని రిషబ్ కోరారు. ఉత్తరాఖండ్ సహాయ చర్యల కోసం మొట్టమొదటి సారి విరాళం ప్రకటించిన రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.