AP Assembly Winter Session 2020: ప్రారంభంమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సంతాపం తీర్మానాల అనంతరం సభ వాయిదా, నెల్లూరు మ్యూజిక్‌, డాన్స్‌ ప్రభుత్వ పాఠశాలలకు ఎస్పీ బాలు పేరు
Andhra Pradesh Assembly Winter Session 2020 (Photo-Video grab)

Amaravati, Nov 30: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభం అయిన తర్వాత మొదటి అంశంగా సంతాప తీర్మానాలు (Andhra Pradesh Assembly Winter Session 2020) ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ మృతికి ముందుగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఐదు దశాబ్దాల పాటు దేశానికి ఆదర్శవంతమై సేవలను ప్రణబ్‌ ముఖర్జీ అందించారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitaram) ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్‌ (Pranab Mukherjee) పదవులకు వన్నె తెచ్చారని.. రాష్ట్రపతిగా స్వతంత్రంగా వ్యవహరించి తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు.

ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu) మరణం పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. తన సుమధుర గానంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని కొనియాడారు. ఆయన గౌరవార్థం​ నెల్లూరులోని మ్యూజిక్‌, డాన్స్‌ ప్రభుత్వ పాఠశాలను డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్‌, డాన్స్‌ పాఠశాలగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పీకర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

కరోనాపై భారీ ఊరట, ఏపీలో 8 వేలకు దిగివచ్చిన కోవిడ్ యాక్టివ్ కేసులు, తాజాగా 690 మందికి కరోనా, 3,787 మంది డిశ్చార్జ్, 7 మంది మృతితో 6,988కి చేరిన మరణాల సంఖ్య

మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, డాక్టర్‌ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్‌, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, మోచర్ల జోహార్‌, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఆయా నియోజవర్గాలకు వీరంతా అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభను (AP Assembly Winter Session 2020) స్పీకర్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. టీ విరామం తర్వాత స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరుకాలేదు.