
Amaravati, August 11: బాపట్ల సభలో సీఎం జగన్ ప్రసంగం అనంతరం 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను (CM YS Jagan Disbursed of Third tranche) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. కార్యక్రమంలో సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం మాట్లాడుతూ.. పథకాలపై (Jagananna Vidya Deevena) కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఈ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు?. గత పాలనలో రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంట. వారిలా నాకు ఏబీఎన్, ఈనాడు, టీవీ5 అండగా లేవు. మీ అందరి దీవెనలే నాకు అండగా ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చాక డీబీటీ ద్వారా పేదలకు నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. గత పాలనకు ఈ పాలనలో తేడాను గమనించండి అని సీఎం జగన్ ప్రజల్ని కోరారు.
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించాం. చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాటు కాకూడదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజ్యూస్తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చుపెట్టాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.
పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంది. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నాం. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఏప్రిల్-జూన్ 2022 కాలానికి గానూ, 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అన్నారు.