Amaravathi, May 17: ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్నటి కంటే ఈరోజు కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ, మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. గడిచిన ఒక్కరోజులో ఏపిలో కోవిడ్ కారణంగా వంద మందికి పైగానే కన్నుమూశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ విధించి కేవలం 10 రోజులే అయింది, ఫలితాలు రావడానికి కనీసం నాలుగు వారాల కర్ఫ్యూ ఉండాలని సీఎం అన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తన సమీక్షలో సీఎం తీసుకున్న నిర్ణయాలను ఈ లింక్ ద్వారా చూడవచ్చు.
రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,749 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 18,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 14,54,052కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 14,51,157గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 3,152 కోవిడ్ కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం నుంచి 2,098, అనంతపూర్ నుంచి 2,094 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 109 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 9,481కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 17,334 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 12,33,017 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,11,554ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.