Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర విషాదం, తాగిన మత్తులో బాంబు నమలడంతో నోట్లో పేలిన కంట్రీ బాంబ్, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి
Representative image. (Photo Credits: Unsplash)

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో ఘోర ప్రమాదంలో ఓ వ్యక్తి నోటిలో కంట్రీ బాంబ్ పేలి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 'యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్' (ఏడీఆర్) నమోదు చేశారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం , మృతుడు గడ్డంవారిపల్లికి చెందిన ఎం చిరంజీవిగా గుర్తించారు. బంగారుపాళ్యం సీఐ నాగరాజురావు మాట్లాడుతూ.. చిరంజీవి తన జీవితంలో చాలా కష్టతరమైన దశను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల ఇంటి నుంచి వెళ్లిన భార్యతో గొడవ పడ్డాడు. ఇది అతనిని నిరుత్సాహానికి గురిచేసింది. అతను మద్యపానాన్ని ఒక కోపింగ్ మెకానిజమ్‌గా మార్చాడు.

పందెం కోడికి కత్తి కడుతుండగా ఒకరు మృతి, ఆట చూసేందుకు వచ్చి కోడికత్తి తగిలి మరొకరు మృతి, సంక్రాంతిరోజు కోడి పందాల్లో విషాదం

కంట్రీ మేడ్ బాంబును నమిలినప్పుడు మృతుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతని నోటిలో బాంబు పేలడంతో ముఖం దెబ్బతింది. పేలుడు శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు చిరంజీవి ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చిరంజీవి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం చిరంజీవి దురదృష్టకర సంఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు చిరంజీవి కంట్రీ బాంబ్ ఎలా, ఎందుకు కలిగి ఉన్నాడు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.

జూలైలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి గ్రామంలోని సింటెక్స్ వాటర్ ట్యాంక్‌లో 22 దేశీ తయారీ బాంబులను పోలీసులు గుర్తించారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి గ్రామం దేశీ తయారీ బాంబుల గుర్తింపుతో గ్రామం మొత్తం భయాందోళనకు గురి చేసింది. ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి సింటెక్స్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లాడు. వాటర్ ట్యాంక్‌లోకి దిగుతుండగా దారాలతో చుట్టిన కొన్ని బంతులు కనిపించాయి. తొలుత ట్యాంక్‌లో వదిలేయాలని భావించినా.. అనుమానం వచ్చి ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం అందించాడు.