AP Panchayat Polls 2021: పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, ఎస్‌ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని వెల్లడి, ఎన్నికల వాయిదాకు నిరాకరణ
Supreme Court | (Photo Credits: PTI)

Amaravati, Jan 25: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ (supreme-court-green-signal) ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ (SEC) నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది.

కాగా ఏపీలో స్థానిక సంస్థలను (AP Panchayat Polls 2021) నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది.

ధర్మాసనం (Supreme Court) స్పందిస్తూ... రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని, వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని పేర్కొంది. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్‌ ప్రశ్నించారు.

ఎస్ఈ కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ, ఎస్ఈసీ తీరుపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లక్షలమంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 5లక్షల ఉద్యోగులకు కోవిడ్‌ వాక్సిన్‌ ఇవ్వాలని, వారి సహకారం లేనిది ఎన్నికలు నిర్వహించలేమని ధర్మాసనం ముందు వాదించారు.

పంచాయితీ ఎన్నికలు జరిగితే 3.60 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారు, ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన ధూళిపాళ్ల అఖిల, 

ఎన్నికలు జరగాలంటే పోలీసుల సహకారం చాలా అవసరమని, పోలీసులకు కూడా వాక్సిన్‌ ఇవ్వాలన్నారు. కరోనా దృష్ట్యా ఇప్పటికే గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మార్చి 1 నుంచి ఎన్నికలు నిర్వహించడానికి అభ్యంతరం లేదన్నారు. జనవరి 28కల్లా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వాక్సిన్‌ ఇవ్వడం పూర్తిఅవుతుందని వివరించారు. వాక్సిన్‌, ఎలక్షన్‌ ఒకేసారి నిర్వహించాలని హైకోర్టు చెప్పడం సరికాదని రోహత్గీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.