
Vijayawada, May 08: పొత్తులపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానంటూ జగన్ (YS Jagan) ఎగిరెగిరి పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గతంలో వైఎస్ఆర్- టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదా అని చంద్రబాబు (Chandra Babu) ప్రశ్నించారు. వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేయలేదా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి (YCP) డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని.. తాము అధికారంలోకి వచ్చాక తడాఖా చూపెడతామన్నారు. పోలీసుల సాయం లేకుండా జగన్ బయటకు రాలేరని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతల పొత్తు పలుకులు ఆసక్తికరంగా మారాయి. రెండ్రోజుల క్రితం పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని ముందుకొచ్చారు. అయితే ఎవరి త్యాగాలూ తమకు అవసరం లేదంటూ చంద్రబాబుకు సోము వీర్రాజు షాకిచ్చారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ (BJP) త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాత్రం పొత్తులపై నర్మగర్భంగా మాట్లాడారు. ఏపీ భవిష్యత్ కోసం చాలామంది కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. అందరం కలిసి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పొత్తులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. డైరెక్ట్గా చెప్పినప్పుడు చంద్రబాబు ప్రస్తావనపై ఆలోచిస్తామన్నారు.
చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddi Reddy Ramachadra Reddy) అన్నారు. పొత్తులు లేకపోతే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తే ఓడిస్తామని పెద్దిరెడ్డి చెప్పారు.