Online Rummy Ban Row: ఏపీలో ఆన్ లైన్ రమ్మీపై హైకోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగా పరిగణించాలని తెలిపిన ధర్మాసనం
హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, కమిటీ నివేదిక వచ్చాక ఆన్ లైన్ రమ్మీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం లేకుండా చూడాలని నిర్దేశించింది.
Vjy, August 29: ఏపీ ప్రభుత్వం మూడేళ్ల కిందట రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించిన సంగతి విదితమే. ఆన్ లైన్ రమ్మీకి బానిసలైన వ్యక్తులు తమ జీవితాలను తల్లకిందులు చేసుకుంటున్నారంటూ ప్రభుత్వం ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ రమ్మీపై నిషేధం వద్దని ఏపీ హైకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది.
ఆన్ లైన్ రమ్మీ అనేది గేమా? లేక అదృష్టంపై ఆధారపడిన అంశమా? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, ఏపీ సర్కారు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు తాజాగా ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, కమిటీ నివేదిక వచ్చాక ఆన్ లైన్ రమ్మీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం లేకుండా చూడాలని నిర్దేశించింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.మూడు వారాల వరకు హైకోర్టు తుది తీర్పు అమల్లోకి తీసుకురావొద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
(The above story first appeared on LatestLY on Aug 29, 2023 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

