
Srikakulam, June 26: ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. లావేరు మండలంలోని కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనేల రాజేశ్వరి(29) అనే గర్భిణి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి నేలబావిలో దూకి ఆత్మహత్య (Pregnant Woman Suicide) చేసుకుంది. ఈ విషాదానికి కారణం భర్త, అత్తమామల వేధింపులేనని మృతురాలి సోదరుడు గన్నెయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మృతురాలి సోదరుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనేల కోటేశ్వరరావుతో పొందూరు మండలం బురిడికంచరాం గ్రామానికి చెందిన రాజేశ్వరికి మూడేళ్ల కిందట (three years after marriage in Srikakulam) వివాహమైంది. కాగా రాజేశ్వరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామలు గండి ఆనంద్, మహేష్లు పెంచి పెద్దచేశారు. వివాహ సమయంలో కొంత కట్నకానుకలు ఇచ్చారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత కోటేశ్వరరావు నిత్యం మద్యం సేవించి వచ్చి రాజేశ్వరిని హింసించేవాడు. అత్తమామలు శ్రీనివాసులమ్మ, రాములు సైతం అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారు. ఈ విషయాన్ని రాజేశ్వరి పలుమార్లు మేనమామలకు, సోదరుడు గన్నెయ్యకు తెలియజేసింది.
ఈ క్రమంలోనే ఈ నెల 23న భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని మరోసారి వేధించడంతో రాజేశ్వరి తన రెండేళ్లు కుమార్తె భువనను తీసుకొ ని లావేరు మండలం చినమురపాక సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న నేలబావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం చినమురపాకకు చెందిన కొందరు నేలబావి వద్దకు వెళ్లగా బావిలో మహిళ, పాప మృతదేహాలు తేలడంతో లావేరు పోలీసులకు సమాచారం అందించారు.
మృతుల వివరాలు తెలియడంతో వెంటనే స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ రాజేష్, పోలీసులు, చినమురపాక, కేశవరాయునిపాలెం వీఆర్వోలు డి.స్వామినాయు డు, ఎం.రమేష్లు బావి వద్దకు వచ్చి మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు గన్నెయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి కేశవరాయునిపాలెంలో వాలంటీరుగా సేవలందించింది.
రాజేశ్వరి కేశవరాయునిపాలెం నుంచి ఈ నెల 23న వెళ్లిపోయిన విషయాన్ని గ్రామస్తులు ఆమె సోదరుడు గన్నెయ్య, మేనమామలకు ఫోన్ ద్వారా తెలియ జేశారు. అప్పటి నుంచి వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలసతో పాటు పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. పాపతో కలిసి రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం తెలియజేయడంతో సోదరుడు, మేనమామలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతికి కారణమైన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు ఇన్ఛార్జి ఎస్.ఐ. రాజేశ్ తెలిపారు.
తన సోదరి వెళ్లిపోయినప్పటి నుంచి లావేరు పోలీసుస్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని గన్నియ్య ఆరోపిస్తున్నారు. విషయాన్ని జేఆర్పురం సీఐ చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు తీసుకోకపోవడంపై విచారణ చేపడతామని తెలిపారు.