Ramateertham Temple: సోము వీర్రాజు అరెస్ట్, రామతీర్థంలో సెక్షన్ 30 అమల్లోకి, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పని సరి, రాముని విగ్రహ ధ్వంసం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
శ్రీరాముడి విగ్రహ ధ్వంసం ఘటన అనంతర పరిణామాలతో అట్టుడికిపోతున్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో (Ramateertham Temple Incident) ఆంక్షలను విధించారు. రామతీర్థం పరిసరాల్లో సోమవారం సెక్షన్ 30ను రెవెన్యూ యంత్రాంగం విధించింది
Ramatheertham, Jan 5: శ్రీరాముడి విగ్రహ ధ్వంసం ఘటన అనంతర పరిణామాలతో అట్టుడికిపోతున్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో (Ramateertham Temple Incident) ఆంక్షలను విధించారు. రామతీర్థం పరిసరాల్లో సోమవారం సెక్షన్ 30ను రెవెన్యూ యంత్రాంగం విధించింది. సభలు, ర్యాలీల ద్వారా నిరసన తెలపాలంటే పోలీసుల ముందస్తు అనుమతిని తప్పనిసరి చేశారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని డీఎస్పీ సునీల్ తెలిపారు.
రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని, చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహం ధ్వంసం దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. రామతీర్థం (Ramatheertham Incident) వైపు ఎవరూ వెళ్లకుండా రాజపులోవ జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
మరోవైపు రామతీర్థంలో సీఐడీ విచారణ ప్రారంభమైంది. తొలుత సమాచారం వెలుగులోకి వచ్చిన విధానాన్ని సీఐడీ అధికారులు సేకరిస్తున్నారు. కాగా రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే. ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
Here;s Updates
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రామతీర్థం క్షేత్రంలోని రాముడికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ @JanaSenaParty తో కలిసి మేము ధర్మయాత్రను చేపడితే,మమ్మల్ని ఈ @ysjagan ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. #SaveTemplesInAP pic.twitter.com/naTUDgqmOR
— Somu Veerraju (@somuveerraju) January 5, 2021
రామతీర్థం ఆలయ పరిసరల్లో సభలు, సమావేశాలకు అనుమతిలేదు: డీఎస్పీ సునీల్.
రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నాం.
ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దు.
చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
విగ్రహం ధ్వంసం దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. pic.twitter.com/XI5mmk1tho
— Sakshi TV (@SakshiHDTV) January 5, 2021
రామతీర్థం ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. ఎటువంటి వసతులు లేని రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆలయ డిజైన్లు ప్రాథమికంగా తయారు చేయించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో విగ్రహ పునఃప్రతిష్ఠ తేదీలను ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను సైతం తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.
ఇదిలా ఉంటే బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ధర్మయాత్ర, ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉందని, ఎటువంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని వీర్రాజుకు స్పష్టం చేసిన పోలీసులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, నెల్లిమర్ల పోలీసు స్టేషన్ కు ఆయన్ను తరలించారు.
అంతకుముందు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, వారు బయటకు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా, వీర్రాజు రామతీర్థం కూడలి వరకూ చేరుకోగా, పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ముందుకు వెళ్లనివ్వకపోవడంతో, బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట కూడా జరిగింది. వారందరినీ చెదరగొట్టిన పోలీసులు సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై బైఠాయించిన సోము వీర్రాజు, తాము ధర్మయాత్రను ముందుగానే ప్రకటించామని, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, జగన్ ప్రభుత్వం దాష్టీకాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలను అనుమతించిన పోలీసులు, తమనెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన బీజేపీ, జనసేన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా, విశాఖపట్నం బీజేపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ధర్మయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ సీఎం రమేశ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లను కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కార్యాలయం గేట్లను మూసివేసి, తాళాలు వేసిన పోలీసులు, నేతలను లోపలే నిర్బంధించారు.
ఈ ఘటనపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. 'రామతీర్థంకు బీజేపీ-జనసేన శాంతియుత యాత్రను అడ్డుకునే వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నాము. విజయసాయి(వైసీపీ), చంద్రబాబు(టీడీపీ)లను పోలీసు రక్షణతో సందర్శించడానికి అనుమతించగా, మా అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని నిరోధించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?' అని జీవీఎల్ నరసింహారావు నిలదీశారు.
(The above story first appeared on LatestLY on Jan 05, 2021 12:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

