Tadipatri Violence: తాడిపత్రిలో 144 సెక్షన్, గొడవకు కారణం ఆ వీడియోనేనా ? డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా, జేసీ ప్రభాకర్ రెడ్డితో సహా ఆయన వర్గీయులు 27 మందిపై కేసు నమోదు, ఘటనపై ఫిర్యాదు చేయనని తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి
Section 144 Imposed in Tadipatri (Photo-Video Grab)

Tadipatri, Dec 25: ప్రశాంతంగా ఉంటున్న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ఒక్కసారిగా (Tadipatri Violence) అట్టుడికింది. టీడీపీకి చెందిన జేసీ సోదరుల వర్గీయులు.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయులు పరస్పర దాడులు చేసుకున్నారు. రాళ్లదాడితో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తాడిపత్రిలో 144 సెక్షన్‌ (Section 144 Imposed in Tadipatri) అమల్లో ఉంటుందని ఎస్పీ బి. సత్యయేసు బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. తాడిపత్రిలో ఇప్పటికే ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అనవసరంగా తాడిపత్రికి వచ్చి గ్రూపుల్లో చేరడం చేయరాదన్నారు. తాడిపత్రి పట్టణం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్పీ (SP B Satyayesu Babu) హెచ్చరించారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) ఇంటి పరిసరాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. డ్రోన్‌ కెమెరాలతో ఆ ప్రాంతంపై పోలీసులు నిఘా పెట్టారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటివద్ద అదనంగా సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్నారు. ప్రస్తుతం జేసీ ఇంట్లోనే ఉన్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (YSSRCP MLA Kethireddy Peddareddy) ఇంటి వద్ద కూడా సేమ్‌ సీన్స్‌. అక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. పెద్దారెడ్డి ఇంటికి సమీపంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇల్లు ఉంది. ఆ ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు.

Here's Tadipatri Violence Visuals:

కాగా జేసీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మనోజ్, బ్రహ్మేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మనోజ్‌, బ్రహ్మేంద్ర ఫిర్యాదు చేయడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు 307సెక్షన్ కింద తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

తాడిపత్రిలో హై టెన్సన్.. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, రంగంలోకి దిగిన పోలీసులు

ఐపీసీ 307, 306 సెక్షన్ల కింద జేసీ వర్గానికి చెందిన 27 మందిపై పోలీసులు కేసులు బుక్‌ చేశారు. దీంతోపాటు ఓ వీడియో ద్వారా గొడవలకు కారణమైన యూట్యూబ్ ఛానల్ విలేకరి వలిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ... తాడిపత్రిలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మాకు ఏ రాజకీయ పార్టీ తో సంబంధం ఉండదు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తాడిపత్రిలో అల్లర్ల పై ఇప్పటిదాకా 3 కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదు చేస్తాం. వారం రోజుల పాటు తాడిపత్రి లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

Here's Nara Lokesh Tweet

ఇక తాడిపత్రి అల్లర్ల కేసులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. నా ఇంటిపైకి దాడికి వచ్చిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలి. నేను ఫిర్యాదు చేయను. ఒకవేళ ఫిర్యాదు చేసినా న్యాయం జరగదు. ఎమ్మెల్యే నా ఇంట్లోకి వచ్చారంటే అది పోలీసుల తప్పే. ఎమ్మెల్యే నా ఇంట్లోకి రావడానికి ఒక ఎస్‌ఐ గేటు తలుపులు తీశారు. గన్‌మెన్‌లతోపాటు మిగతా పోలీసులు ఆయన వెంట వచ్చారు. ఇంట్లో లేనప్పుడు కొజ్జావాళ్లైనా వచ్చిపోతారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

మేడ్చల్ జిల్లాలో దారుణం, ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్, కారం పొడితో దాడి చేసిన భూకబ్జాదారులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, యశోదాలో చికిత్సపొందుతున్న సీఐ భిక్షపతి

ఇక ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ.. గూండాలను పెట్టుకొని వారికి జీతాలు ఇచ్చి రెచ్చగొట్టే పోస్టింగ్‌లు (జేసీ ప్రభాకర్‌రెడ్డి) పెట్టిస్తున్నారు. ఇలాంటి పోస్టింగులతో శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన లేకపోవడంతో కొద్దిసేపు కూర్చొని వచ్చానే తప్ప దాడి చేసేందుకు వెళ్లలేదని తెలిపారు.

గొడవకు కారణం ఏంటి ?

అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో జేసీ అనుచరులు కొందరు అసభ్య పోస్టులు పెట్టారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జేసీ నివాసానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో జేసీ అనుచరులు సైతం ఆందోళన మొదలుపెట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి వివరణ ఇచ్చినా తీరు మార్చుకోలేదని.. అదేపనిగా దుష్ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి ఎడ్ల బండి ఇసుకకు రూ. 10 వేలు వసూలు చేస్తున్నారంటూ ఓ కాంట్రాక్టర్‌, ఓ ఎద్దులబండి యజమాని మధ్య ఫోన్‌ సంభాషణను టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారని దీంతో ఆ మద్దతుదారునిపై దాడికి ఎమ్మెల్యే వర్గీయులు వచ్చారని మరో కథనం కూడా వినిపిస్తోంది. అయితే ఇది తప్పుడు ప్రచారమని..ఇలాంటి తప్పుడు వార్తలతో ఎమ్మెల్యే కుటుంబాన్ని కించపరుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.