Nellore, April 3: ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. అనంతరం 9 నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి నేరుగా తిరుపతి రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. ఎక్కడా ప్రయాణికులకు అందుబాటులో ఉండదు. ఈ రైలు 9వ తేదీన తిరుపతి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఈ రైలు 10వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
సాధారణంగా ప్రస్తుతం ఉన్న అన్ని సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లు కేవలం 70 నుంచి 100 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణిస్తాయి. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్కు మాత్రం 110 నుంచి 130 కిలోమీటర్ల వరకు స్పీడ్ కెపాసిటీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 110 కి.మీ. వేగంతో, ట్రాక్ ఇబ్బందులు లేనిచోట్ల 130 కి.మీ. వేగంతో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి.
సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..
ప్రస్తుతం తిరుగుతున్న ఎక్స్ప్రెస్, సూపర్పాస్ట్ రైళ్లలో అన్నీ కలిపి 23 కోచ్లు ఉంటాయి. కానీ వందే భారత్ రైలు సూపర్ స్పీడ్తో ప్రయాణించనుండడంతో కేవలం 8 ఏసీ కోచ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పరిస్థితిని బట్టి మరికొన్ని రోజుల్లో కోచ్లు పెంచే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు వందే భారత్ రైలు నెల్లూరు రైల్వేస్టేషన్లో ఆగనుంది.
సికింద్రాబాద్ – తిరుపతి(20701) వందే భారత్ రైలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి – సికింద్రాబాద్(20702) వందే భారత్ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు సాయంత్రం 5.20 గంటలకు, సికింద్రాబాద్కు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది.