Skill Development Scam Case: చంద్రబాబు అరెస్ట్పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్, రేపు విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం, నేడు కీలక తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు?
Vjy, Sep 12: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అవినీతి నిరోధక చట్టం సెక్షన్17 ఏ ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఈ ప్రక్రియ అంతా సరికాదు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై వాదనలు వినిపిస్తాం’’ అని పిటిషన్లో దమ్మాలపాటి పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి విచారణ బుధవారం చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ నేడు జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డుపై 2022లోనే చంద్రబాబుపై కేసు నమోదు అయిన సంగతి విదితమే. ఈ కేసులో చంద్రబాబును విచారించాలని కోరిన ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంలో సిట్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్ను ఏ–5గా పేర్కొంది.
చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా, ఏసీబీ కోర్టులో లాయర్లు ఏం వాదించారంటే..
చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు న్యాయవాదులకు న్యాయమూర్తి సూచించారు. నేడు కౌంటర్ దాఖలు చేస్తామని సిద్ధార్థ లూద్రా కోర్టుకు తెలిపారు.చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ప్రధానంగా పేర్కొన్న లూద్రా. ఎన్ఎస్జీ భద్రత, వీవీఐపీ, 73 ఏళ్ల వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హౌస్ అరెస్ట్కు అనుమతి ఇవ్వాలంటూ నిన్న వాదనలు వినిపించారు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్పై నేటి మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలవరించే అవకాశం ఉంది.
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు జైళ్ల శాఖ పేర్కొంది. చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. చంద్రబాబు కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కోర్టుకు జైళ్ల శాఖ తెలిపింది. చంద్రబాబు కోసం ఓ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. జైలు ప్రధాన బ్లాక్తో సంబంధం లేకుండా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. భద్రత దృష్ట్యా బ్లాక్ అన్ని వైపులా బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వార్డుల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరూ ప్రవేశించాలన్నా.. ప్రత్యేక అనుమతులు అవసరం. చంద్రబాబు అనుమతితోనే ములాఖత్కు అనుమతిస్తాం. రాజమండ్రి సూపరింటెండెంట్ సహా అధికారులు అందుబాటులో ఉంటారు. 24 గంటలపాటు ఈ వార్డు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని జైళ్ల శాఖ తెలిపింది.
(The above story first appeared on LatestLY on Sep 12, 2023 12:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

