IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరవచ్చని తెలిపిన ధర్మాసనం
2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్ పై ఉన్నారని... చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది.
New Delhi, Jan 29: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ (Chandrababu's anticipatory bail) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ( Chandrababu's anticipatory bail cancellation petition) కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వం సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
చంద్రబాబు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తమను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.చంద్రబాబుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న కేసుల వివరాలు కూడా తీసుకుంది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్ఎల్పిని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం దర్మాసనం వ్యాఖ్యానించింది.
2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్ పై ఉన్నారని... చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. ఒకే ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులంతా బెయిల్ పై ఉన్నప్పుడు... అవే నిబంధనలకు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని తెలిపింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కూడా 17ఏ నిబంధన వర్తిస్తే ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా, సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. పలు ఐపీసీ సెక్షన్లు కూడా దీనికి ఉన్నాయని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ... ఈ కేసుకు సెక్షన్ 420 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. ప్రస్తుత దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది.
(The above story first appeared on LatestLY on Jan 29, 2024 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

