Corona Cases in AP: మళ్లీ 14 కొత్త కేసులు, ఏపీలో 266కి చేరుకున్న కరోనావైరస్ కేసులు, ఇద్దరు మృతి, ఐదుగురు రికవరీ
Coronavirus Outbreak in India. | Photo-PTI

Amaravati, April 6: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా మరో 14 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు (Corona Cases in AP) నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు చేరింది.

కొత్తగా నమోదైన 14 కేసుల్లో విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఐదుగురు కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి (Coronavirus Deaths) చెందారు.

ఏపీలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల వరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించింది.

డేంజర్ జోన్‌లో 11 రాష్ట్రాలు, గంట గంటకు పెరుగుతున్న కరోనా కేసులు

కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 5గురు బాధితులు రికవరీ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య అనంతపురం 6, చిత్తూరు 17, తూర్పు గోదావరి 11, గుంటూరు 32, కడప 23, కృష్ణా 28, కర్నూలు 56, నెల్లూరు 34, ప్రకాశం 23, విశాఖ 20, పశ్చిమ గోదావరిలో 16 నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాలేదు. కరోనా కారణంగా నిన్న ఉదయం ఒకరు, నిన్న సాయంత్రం ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

కర్నూలులో కరోనా కల్లోలం

ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 463 శాంపిల్స్‌ను అధికారులు సేకరించగా.. వాటిలో 343 కేసులకు సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. వీటిలో 56 పాజిటివ్ రాగా... 287 నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.

కాగా పాజిటివ్ వచ్చిన 56 కేసుల్లో 55 కేసులు ఢిల్లీ జమాత్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వారివే కావడం గమనార్హం. ఇవాళ్టి నుంచి కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలను అధికారులు మరింత కఠినతరం చేశారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా టెలి మెడిసిన్ విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు.