Free Electricity For Farmers: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తు, దళితబిడ్డలకు దళితబంధు.. సీఎం కేసీఆర్ స్పష్టం
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్కు అధికారమిస్తే.. రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశంగా మారుస్తామని ప్రకటించారు.
Hyderabad, Jan 3: బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు (Farmers) ఉచిత విద్యుత్తునిస్తామని (Free Electricity).. దళితబిడ్డలకు దళితబంధు (DalitBandhu) పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టంచేశారు. బీఆర్ఎస్కు అధికారమిస్తే.. రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశంగా మారుస్తామని ప్రకటించారు. దేశం మొత్తం ఉచిత విద్యుత్తునివ్వడం అసాధ్యమేమి కాదని చెప్పా రు. ఏపీకి చెందిన పలువురు నేతలు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జాబితాలో ఏపీ నేతలు రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు. రావెల కిశోర్ బాబు ఢిల్లీ కేంద్రంగా బాధ్యతలను నిర్వర్తిస్తారని కేసీఆర్ తెలిపారు.
వజ్రాల్లాంటి ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారని కేసీఆర్ పేర్కొన్నారు. ఏపీలో పలువురు సిట్టింగ్ నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఏ కార్యక్రమమైనా మొదట చిన్నదిగానే ఉంటుందని, విజయతీరం చేరాలంటే ఎన్నో అవహేళనలు దాటాలని అన్నారు. స్పష్టమైన లక్ష్యం ఉన్నవారినే విజయలక్ష్మి వరిస్తుందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశం ఎటువైపు వెళుతోందో ఇవాళ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇంత సువిశాల దేశానికి సామూహిక లక్ష్యం ఉండాలి... వ్యవస్థీకృతంగా పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యం అని అభిప్రాయపడ్డారు.
ఏంచేసైనా సరే ఎన్నికల్లో గెలవడమే కొన్ని పార్టీల లక్ష్యం అని వ్యాఖ్యానించారు. విద్వేషాలు, మతకల్లోలాలు రెచ్చగొట్టి గెలవాలని చూస్తున్నారు అని విమర్శించారు. గొంతెత్తి మరీ మేకిన్ ఇండియా నినాదం ఇస్తున్నారని, కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చైనా నుంచి వస్తున్నాయని అన్నారు. మనదేశంలోని ప్రతి వీధిలో చైనా బజార్లు ఉన్నాయి... మరి మేకిన్ ఇండియా నిజమైతే ఇన్ని చైనా బజార్లు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు.
ఏటా వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని కేసీఆర్ వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ సరిపడా నీళ్లు దొరకడంలేదని తెలిపారు. దేశంలో పంటలు బాగా పండే భూములు 43 కోట్ల ఎకరాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవి అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు అని తెలిపారు. 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని చెప్పారు. పనిచేసే జనాభా ఎక్కువగా ఉండడం మన దేశానికి పెద్ద సంపద అని అభివర్ణించారు. ఇన్ని అనుకూలతల మధ్య భారత్ ప్రపంచంలోనే అత్యధిక ఆహారోత్పత్తి దేశంగా మారాలని అభిలషించారు.
(The above story first appeared on LatestLY on Jan 03, 2023 09:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

