
Hyd, March 6: కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు(Karimnagar Graduate MLC Election). తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజేత ఎవరో తేలక పోవడంతో మూడో స్థానంలో నిలిచిన ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని విజయం వరించింది.
మొత్తం 56 మంది బరిలో నిలవగా 2,52,029 మంది ఓటేశారు. 28,686 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,23,343 ఓట్ల నుంచి గెలుపు కోటాను 1,11,672 ఓట్లుగా అధికారులు నిర్ణయించారు.
మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 75,675 ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలోనూ 70,565 ఓట్లతో కాంగ్రెస్ రెండు, 60,419 ఓట్లతో బీఎస్పీ మూడో స్థానంలో నిలిచాయి. రెండో ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,106 ఓట్ల ఆధిక్యంలో నిలవగా అంజిరెడ్డి(BJP Anjireddy) గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి.
అంజిరెడ్డి విజయం పట్ల కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందని... తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని తెలిపారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ గెలిచిందని తెలిపారు. ఇది తెలంగాణలో బీజేపీ భవిష్యత్తుకు నాంది అని తెలిపారు బండి.