Covid in TS: యూకే నుంచి కొత్త కరోనా వైరస్, హైదరాబాద్కు బ్రిటన్ నుంచి ప్రయాణికులు, అప్రమత్తమైన తెలంగాణ సర్కారు, వారిని ట్రాక్ చేసే పనిలో బిజీ, యూకేకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్
కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ గత వారం రోజులుగా హైదరాబాద్ చేరుకున్న వారి వివరాలను విమానాశ్రయ వర్గాల ద్వారా సేకరించింది. ఇప్పుడు వారిని ట్రాక్ చేసే పనిలో పడిందని తెలుస్తోంది.
Hyderabad, Dec 22: బ్రిటన్ లో కొత్త రకం కరోనావైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం (India Govt) ఆ దేశం నుంచి రాకపోకలను నిషేధించిన సంగతి విదితమే. డిసెంబర్ 31 వరకు అంతర్జాతీయ రాకపోకలను రద్దు ( International Flights suspended from UK) చేసింది. నేటి అర్థ రాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పౌర విమానాయాన శాఖ తెలిపింది.
దీంతో పాటు యూకే నుంచి డిసెంబర్ 22 అర్థరాత్రి లోపు భారత్ కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్ టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. అందులో పాజిటివ్ అని తేలితే వారిని ఇనిస్టిట్యూషల్ క్వారంటైన్ కి పంపుతామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి తెలిపారు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఏడు రోజులు పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు (Telangana Govt) కూడా అలర్ట్ అయింది. బ్రిటన్ నుంచి రోజుకు రెండు విమానాలతోపాటు 11 వరకు కనెక్టడ్ విమానాలు హైదరాబాద్లో (Hyderabad) ల్యాండ్ అవుతున్నాయి . వీటి ద్వారా రోజుకు దాదాపు 600 మంది వరకు ప్రయాణికులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. కాగా కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ గత వారం రోజులుగా హైదరాబాద్ చేరుకున్న వారి వివరాలను విమానాశ్రయ వర్గాల ద్వారా సేకరించింది. ఇప్పుడు వారిని ట్రాక్ చేసే పనిలో పడిందని తెలుస్తోంది.
ట్రాకింగ్లో దొరికిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో చేరవేసి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అంతేకాదు, బ్రిటన్ నుంచి వచ్చే వారి చుట్టుపక్కల నివసించే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త వైరస్ ముప్పు నేపథ్యంలో కొవిడ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చేవారి పాస్పోర్టులో స్టాంపింగ్ ఆధారంగా గత కొన్ని రోజులుగా వారు ఏయే దేశాల్లో పర్యటించారో తెలుసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
బ్రిటన్ లో కొత్త కరోనావైరస్ (New Coronavirus Strain) వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు ఇప్పటికే యూకేకు రాకపోకలను నిషేధించాయి. ఇదిలా ఉంటే కొత్త వైరస్ తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భారత ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. మరోవైపు కొత్త రకం వైరస్ పుట్టుక, వ్యాప్తిపై చర్చించేందుకు గానూ కేంద్ర ఆరోగ్య శాఖ నేడు కీలక సమావేశం నిర్వహించింది.
(The above story first appeared on LatestLY on Dec 22, 2020 12:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

