Telangana: వైద్య, ఆరోగ్య సిబ్బందికి మరియు పోలీసు సిబ్బంది జీతాల్లో ఎలాంటి కోతలు లేవు, అదనంగా నగదు ప్రోత్సాహం, ఉద్యోగుల కోతలపై ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం
Govt of Telangana | File Photo

Hyderabad, April 2:  కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ (PM Modi Video Conference) నిర్వహిస్తుండగా, మరోవైపు ఇదే అంశంపై గవర్నలతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నిన్న సాయంత్రమే గవర్నర్ తమిళిసైని కలిసి రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు.

ఈరోజు ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, వైద్యసిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై మధ్యాహ్నం నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (Full Salary & Incentive) కూడా అందించాలని నిర్ణయించారు. ఇన్సెంటివ్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

అయితే 50 శాతం కోత విధించడం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొంత మంది ఇళ్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండి, మిగతా కుటుంబ సభ్యులంతా ఆ ఒక్కరి జీతంపైనే ఆధారపడి ఉండేవారు ఉన్నారు. అద్దెలు చెల్లించడం, చిట్టీలు కట్టుకోవడం ఈఎంలు చెల్లించడం ఇలా నెలవారీ ఖర్చులతో వారి నెలజీతం పూర్తిగా ఆవిరైపోతుంది. కోత భరించలేం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ కు చెందిన ఓ చిన్నారి "కేసీఆర్ తాత, మా అమ్మ చనిపోయింది. నాన్న జీతంలో ఫిబ్రవరి ఇన్కాం టాక్స్ లో పోయింది, మళ్ళీ మార్చిలో కోత పెట్టకండి, కనికరించండి ప్లీజ్" అంటూ ప్లకార్డ్ చూపిస్తూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావం, మార్చి నెల నుంచి ఉద్యోగుల వేతనాలలో కోత

ఇక కలెక్టర్ల వేతనాల్లో కూడా 60% కోత పెట్టడంతో వారికి ఇది నచ్చడం లేదు. సీఎంకు ఎదురెళ్లలేక లోలోపల వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నగదు నిల్వ ఉండాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ అందరి జీతాలు ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తుందని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ సూత్రప్రాయంగా చెప్పినట్లు సమాచారం.