Sangareddy Shocker: సంగారెడ్డిలో దారుణం, భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త, వివాహేతర సంబంధం అనుమానమే పెనుభూతంగా మారింది

అనుమానం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైంది. వివాహ బంధం నమ్మకంపై నిలబడే కాపురంలో, అనుమానం చిచ్చు పెట్టింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త తన జీవిత భాగస్వామినే కిరాతకంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్‌ఆర్ నగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Sangareddy Shocker: సంగారెడ్డిలో దారుణం, భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త, వివాహేతర సంబంధం అనుమానమే పెనుభూతంగా మారింది
Image used for representational purpose | (Photo Credits: PTI)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాకు చెందిన చెవుల బ్రహ్మయ్య, కృష్ణవేణి (37) దంపతులు కొంతకాలంగా అమీన్‌పూర్‌లో నివాసముంటున్నారు. కృష్ణవేణి కోహిర్‌లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (DCCB) అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తుండగా, బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఇంటర్‌లో, కుమారుడు 8వ తరగతి చదువుతున్నారు.

ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణవేణిపై అనుమానంతో బ్రహ్మయ్య తరచూ గొడవలు పెట్టేవాడని, ఈ కారణంగా ఇంట్లో తరచూ వాగ్వాదాలు జరిగేవని పొరుగువారు తెలిపారు. ఆదివారం ఉదయం కూడా ఇలాంటి వాగ్వాదం తీవ్రమైంది. కోపం అదుపులో ఉంచుకోలేకపోయిన బ్రహ్మయ్య, ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌ను పట్టుకుని కృష్ణవేణిపై దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది.

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును వెనుక నుండి ఢీకొట్టిన లారీ, బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం

కుటుంబ సభ్యులు, పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అమీన్‌పూర్ సీఐ నరేశ్ బృందంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి, కోపంలో హత్య చేశానని అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో కేఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. మృతురాలి ఉద్యోగ సహచరులు, పొరుగువారు షాక్‌కు గురయ్యారు. కృష్ణవేణి క్రమశిక్షణతో, మృదువైన స్వభావంతో ఉండేదని, ఇంత దారుణ ఘటన జరిగిందని నమ్మలేకపోతున్నారని తెలిపారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతుందో అనే ఆందోళన ప్రాంతమంతా వ్యాపించింది. సీఐ నరేశ్ మాట్లాడుతూ, “భార్యపై అనుమానం కారణంగా భర్త హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిందితుడిని విచారిస్తున్నాం” అని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).