
Hyderabad, December 16: కరోనావైరస్ నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ మరికొద్ది కాలంలో అందుబాటులోకి రానుంది. అయితే వైరస్ మాత్రం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ప్రతిరోజు తెలంగాణలో వందల కొద్దీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 52,057 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 536 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 676 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 62,57,745 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 279,135కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 107 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 43, రంగారెడ్డి నుంచి 41 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.


మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,502కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 622 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 270,450 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,183 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.